ఆ పదవి వద్దు, నాకు ఎన్నో హామీలిచ్చారు, నా మాట వింటే సరే.. నేనే సీఎం: కాంగ్రెస్పై రేవంత్ సంచలనం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి పదవి అని స్పష్టం చేశారు.
అన్ని వివరాలతో చర్చిద్దాం!: కేసీఆర్, ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం, ఏం జరుగుతోంది?
ఆయన కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపటికి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదన్నారు. అలాగే, తన పదవిపై కూడా స్పందించారు.
నాకు ఆ పదవి వద్దు, రాహుల్కు లేఖ రాస్తా, ఎన్నో హామీలిచ్చారు
తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వద్దని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని వెల్లడించారు. తనను టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ గాంధీ దూతలు తనకు చాలా హామీలు ఇచ్చారని చెప్పారు.
నాకు హోదాకు తగిన పదవి కావాలి, ఇతర పదవి వద్దు
కాంగ్రెస్ పార్టీ టీం లీడర్కు సరైన సలహాలు ఇచ్చేవారు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన పని తీరు తెలిసి కూడా తమ టీం లీడర్ తనను సరిగా వాడుకోవడం లేదని చెప్పారు. నాకు హోదాగు తగిన పదవి కావాలని ఓ విధంగా డిమాండ్ చేసారు. వేరే పదవి ఇచ్చినా స్వీకరించనని, పని చేయనని తేల్చి చెప్పారు. అవసరమైతే సామాన్య కార్యకర్తలా పని చేస్తానని చెప్పారు.
ఎప్పటికైనా సీఎంను అవుతా, అదే నా లక్ష్యం
తనకు వయస్సు ఉందని, ఓపిక ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కావడం తన లక్ష్యమని తేల్చి చెప్పారు. ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్ల తర్వాత తాను సీఎంను అవుతానని చెప్పారు. నా సలహా మేరకే కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్లు దీక్ష చేశారని చెప్పారు.
నన్ను వాడుకుంటే సొమ్ము, లేదంటే మన్ను
తన పని తీరు అందరికీ తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు. తన పని తీరును బట్టి తనను వాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి సొమ్ము అవుతుందని చెప్పారు. తనను వాడుకోకుంటే కాంగ్రెస్ పార్టీకి మన్ను దొరుకుతుందని మండిపడ్డారు.
ఏసీబీ కేసుల సమీక్ష సంతోషకరమే
అంతకుముందు, మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి.. కేసీఆర్ -మోడీలపై నిప్పులు చెరిగారు. ఏపీ కోసం చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని, మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై తాము బస్సుయాత్ర చేపట్టామని, చంద్రబాబు నిర్ణయంతో మోడీకి జరిగిన నష్టాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని రేవంత్ మండిపడ్డారు. ఏసీబీ కేసులపై సమీక్ష సంతోషమే అన్నారు.