మావాళ్లకివ్వకుంటే మేమూ తప్పుకుంటాం: కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి వార్నింగ్, కోమటిరెడ్డి అలక!
హైదరాబాద్: మహాకూటమిలో అన్ని పార్టీల్లో ఇంటా బయటా సీట్ల సర్దుబాటు గొడవ రాజుకుంది. కూటమిలో సీపీఐ, కాంగ్రెస్, కోదండరాం తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు సీట్లు పూర్తిగా కొలిక్కి రాలేదు. మరోవైపు ఏయే స్థానాల్లో అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
Recommended Video
పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో పదిపదిహేను స్థానాల్లో గట్టి పోటీ నెలకొని ఉంది. మరోవైపు, ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లు కూడా ఉండటం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తికి కారణమైంది. శుక్రవారం హైదరాబాదులోని గాంధీ భవన్కు అసంతృప్తుల సెగ తగిలింది. పలువురు సీనియర్ నేతలు, ఆశావహులు సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్నారు.
అనుచరులకు టిక్కెట్లు అడుగుతున్న రేవంత్, కోమటిరెడ్డి
అసంతృప్తుల జాబితాలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయితే ఆయన తన కోసం కాకుండా తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు కోరుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంపిణీ వ్యవహారం సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. చాలామంది నేతలు తమతో పాటు అనుచరులకు సైతం పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇందులో రేవంత్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎనిమిది సీట్లు.. అలకబూనిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి టీడీపీలోని తన సన్నిహితులతో పాటు కాంగ్రెస్ పార్టీలో గత ఏడాది చేరారు. ఆ సమయంలో టిక్కెట్ల విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అది నెరవేరలేదని ఆయన అలకబూనారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వకుంటే తప్పుకోవడానికి కూడా వెనుకాడేది లేదని రేవంత్ చెబుతున్నారట. రేవంత్ తన వారి కోసం ఎనిమిది సీట్లు కోరినట్లుగా తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ఎవరికి టిక్కెట్లు కోరుతున్నారంటే?
రేవంత్ కోరుతున్న సీట్లు వరంగల్ వెస్ట్(నరేందర్ రెడ్డి), నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి), ఆర్మూర్ (రాజారామ్ యాదవ్), ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి), దేవరకొండ (బిల్యా నాయక్), ఇల్లందు (హరిప్రియ), సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి), చెన్నూరు (బోడ జనార్ధన్)లకు టిక్కెట్లు కోరుతున్నారు.
నకిరేకల్లో అనుచరుడి కోసం కోమటిరెడ్డి అల్టిమేటం
నకిరేకల్ స్థానాన్ని మన ఇంటి పార్టీకి ఇవ్వవద్దని మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి అధిష్టానాన్ని కోరారు. చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ సీటు కేటాయించాలని రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలిచే కాంగ్రెస్ అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలన్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ గెలుపుగా మలుచుకోవాలన్నారు. సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డికి సీటు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మునుగోడు నుంచి తనకు, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్కు, నకిరేకల్ నుంచి చిరుమర్తికి వస్తాయని భావిస్తున్నామన్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకట రెడ్డికి పార్టీ ఇంచార్జ్ కుంతియా ఫోన్ చేసి, తెలంగాణ ఇంటి పార్టీకి టిక్కెట్ కేటాయించలేదని, నకిరేకల్ చిరుమర్తికేనని హామీ ఇచ్చారు.
పలువురు అసంతృప్తులు
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా టిక్కెట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జనగామ టిక్కెట్ను పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి ఇచ్చారని, ఇక్కడి నుంచి కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఖానాపూర్ టిక్కెట్ హరినాయక్కు ఇవ్వాలని గాంధీ భవన్ ఎదుట ఆయన వర్గీయులు నిరసన తెలిపారు. మల్కాజిగిరి టిక్కెట్ తనకు కేటాయించాలని నందికంటి శ్రీధర్ అనుచరులు ఆందోళనకు దిగారు.