శ్రీశైలం 'మల్లన్న' గట్టెక్కిస్తాడా?: దైవ సన్నిధిలో రేవంత్..
కుటుంబ సమేతంగా రేవంత్ ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.
శ్రీశైలం: రేవంత్ను పార్టీ నుంచి పంపించడం ఇక లాంఛనమే అనే రీతిలో టీటీడీపీలో పరిణామాలు చేసుకుంటున్నాయి. రేవంత్ను అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తమ అధినేతకు లేఖ రాయడంతో వివాదం ముదిరి పాకాన పడింది.
Recommended Video
మరోవైపు రేవంత్ మాత్రం టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన వెంట నడిచేవాళ్లు తనతోనే ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపీలో నాటకీయ పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంలోకి నెడుతున్నట్టే కనిపిస్తున్నాయి. అదే సమయంలో రేవంత్ కు ఈ పరిణామం లాభం చేకూరుస్తుందా? నష్టం చేస్తుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం విశేషం. కుటుంబ సమేతంగా ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఈసందర్భంగా దేవస్థానం అధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
రేవంత్ మల్లన్న స్వామిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టీటీడీపీ రాజకీయాల నుంచి ప్రశాంతత కోసమే ఆయన అక్కడికి వెళ్లారా?.. లేక తన భవిష్యత్తు రాజకీయాలకు ఆశీర్వచనం తీసుకోవాలని వెళ్లారా? అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి మల్లన్న ఆశీర్వాదం రేవంత్ను ఎలా గట్టెక్కిస్తుందో!