పార్టీ నేతలకు కేంద్ర బిందువు: తెలంగాణ టిడిపికి రేవంతేనా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కేంద్ర బిందువుగా మారిపోతున్నారు. తెలంగాణలోని పలువురు పార్టీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో రేవంత్ రెడ్డి సఫలమవుతున్నట్లుగా టిటిడిపి నేతలు భావిస్తున్నారు. కాగా, జైలు నుంచి బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డిని పరామర్శిస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోంది.
జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఆయన ఇంటికి నాయకుల తాకిడి ఎక్కువైంది. సోమవారం కొండంగల్లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన టిడిపి నేతలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, కందిమళ్ల నాగప్రసాద్, శ్రీశైల్ రెడ్డి పంజుగుల పరామర్శించారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, గ్రేటర్ ఎన్నికలు తదితర అంశాలను చర్చించామని నాయకులు తెలిపారు.
ఓటుకు నోటు వ్యవహారంలో తమ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు తమ బాస్ చెప్పాడని అధికారిక పార్టీకి చెందిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి రూ. 5కోట్లు ఇవ్వజూపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసిబి వీడియో, ఫోన్ రికార్డింగ్స్ ఆధారంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది.
దాదాపు నెలరోజులపాటు జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయన విడుదలైన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎం, మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ మొత్తం పరిణామాలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పలువురు నాయకులు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు పలుతున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఇతర నేతలను ఎదుర్కొవాలంటే రేవంత్ లాంటి నాయకుడే టిడిపికి నాయకత్వం వహించాలనే వాదనలు టిటిడిపిలో బలంగా వినిపిస్తున్నాయి.