టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!
హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. అర్హత సాధించిన టీఆర్టీ అభ్యర్థులు తమకు వెంటనే పోస్టులు కేటాయించాలంటూ ప్రగతి భవన్ ముట్టడించారు. ఈ క్రమంలో వారికి మద్దతు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఆ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
2017లో టీఆర్టీ ఉద్యోగాల భర్తీ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత పరీక్ష నిర్వహించింది. అందులో అర్హత సాధించి ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభ్యర్థులు.. నియామక ఉత్తర్వులు ఇంకా అందలేదని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇంతకు నియామక పత్రాలు ఇస్తారో లేదో తెలియక అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారని అందులో ప్రస్తావించారు.
ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!
నిరుద్యోగ యువత పట్ల కనికరం లేని టీఆర్ఎస్ ప్రభుత్వం సోమరితనమేంటో స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ఆ మేరకు గిన్నిస్ బుక్లో కేసీఆర్ సర్కార్కు కచ్చితంగా స్థానం దక్కుతుందని లేఖలో పేర్కొన్నారు. మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటారే తప్ప టీఆర్టీ అభ్యర్థుల ఆవేదన అర్థం చేసుకోరా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలు, హుజుర్నగర్ ఉప ఎన్నికపై చూపిస్తున్న శ్రద్ధ ఉద్యోగ నియామకాలపై పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. యువత పట్ల శ్రద్ధ పెట్టకపోవడం సిగ్గుచేటుగా అనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తారు.