గ్రేటర్లో ఓడినా... రేవంత్ రెడ్డే తెలంగాణ టిడిపి 'విన్నర్', సీనియర్ల అసంతృప్తి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఒక డివిజన్ను మాత్రమే గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో 45 సీట్లతో రెండో స్థానంలో ఉన్న టిడిపి ఇప్పుడు ఏకంగా 44 సీట్లు కోల్పోయి ఒక సీటుకు పరిమితం అయింది.
గ్రేటర్ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు తమ భుజాల పైన వేసుకున్నారు. వారు జోరుగా ప్రచారం చేశారు. అయినప్పటికీ టిడిపి బొక్క బోర్లా పడింది.
గ్రేటర్ ఎన్నికలు టిడిపికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని టిడిపి ప్రధాన కార్యదర్శిగా కొనసాగించనుంది. ఇది పార్టీలోని సీనియర్లకు ఆగ్రహాన్ని కలిగిస్తోందని తెలుస్తోంది.
తెలంగాణలో పర్యటనలు రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి టిడిపి అధిష్టానం అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పార్టీ సీనియర్లు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణలను విస్మరించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డియే తెలుగుదేశం పార్టీకి ఓట్లను తెచ్చే వ్యక్తిగా టిడిపి అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ముందు ముందు పార్టీలోని ఇతర సీనియర్ల కంటే రేవంత్ రెడ్డికి అధిష్టానం మరింత ప్రాధాన్యత ఇవ్వవచ్చునని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
మిగతా వారి కంటే.. రేవంత్ రెడ్డిని రాజకీయంగా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ముందు ముందు పుష్ చేయనుందని అంటున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలోనే చంద్రబాబు, నారా లోకేష్లు రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించిందని అంటన్నారు. రేవంత్ అభిమానులు అతనిని తెలంగాణ టైగర్గా, అసెంబ్లీ టైగర్గా చెబుతుంటారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి చాలా పాపులర్ అయిన వ్యక్తి అని, అతను కచ్చితంగా టిఆర్ఎస్ కిల్లర్ ఇన్స్టింక్ట్ అని, రేంత్ రెడ్డి దూకుడు ఇతర నేతల్లో కనిపించడం లేదని చంద్రబాబుకు దగ్గరగా ఉండే ఒకరు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఎర్రబెల్లి దయాకర రావు అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నారాయణఖేడ్ ఎన్నికల విషయంలోను పర్యటనల గురించి ఎలాంటి సందేశం లేదని, రేవంత్ రెడ్డికి బాగా ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఇది సరికాదని చెబుతున్నారట.