కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూం బీబీసీలోకి ఎక్కింది : రేవంత్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపర్చారని విమర్శించిన ఆయన.. కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ విషయం బీబీసీలోను ప్రసారం చేయబడిందని గుర్తుచేశారు.
కరీంనగర్: తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త క్యాంపు కార్యాలయంలో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇంటలిజెన్స్ సూచనల మేరకు ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిసింది. కాగా, దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తానన్న హామిని పక్కనబెట్టి.. తన ఇంటిని మాత్రం సకల హంగులతో నిర్మించుకున్నారని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపర్చారని విమర్శించిన ఆయన.. కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ విషయం బీబీసీలోను ప్రసారం చేయబడిందని గుర్తుచేశారు.
జాతకాల పిచ్చితో సచివాలయాన్ని కూలగొట్టే చర్యలు సరికాదన్న రేవంత్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు.సీఎం కుర్చీలో చినజీయర్ స్వామిని కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్9 నుంచి జనవరి 26వరకు విద్యార్థి పోరు చేపట్టనున్నట్లు ప్రకటించారు.