మోస్ట్ కరెప్టెడ్... రెవెన్యూ శాఖపై మరోసారి చర్చ... చెక్ చెప్పేందుకే కేసీఆర్ ఆ అస్త్రం...
రెవెన్యూ శాఖ.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో ఇదీ ఒకటి. అత్యంత అవినీతి శాఖగానూ దీనిపై ముద్ర పడింది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లు,రిజిస్ట్రేషన్లతో ముడిపడి ఉన్న శాఖ కావడంతో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతుంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు డబ్బు ఆశజూపి ప్రభుత్వ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం,వేరే వ్యక్తుల భూములను కాజేయడం,వివాదాస్పద భూముల్లో పాగా వేయడం... ఇలా తవ్వుతూ పోతే అంతులేని అక్రమాలు తరుచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కీసర ఎమ్మార్వో నాగరాజు రూ.1కోటి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం రెవెన్యూ శాఖలో అవినీతిని మరోసారి బయటపెట్టింది. రెవెన్యూ శాఖలో అవినీతి గురించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు. ఈ అవినీతికి కొత్త రెవెన్యూ చట్టంతో కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. నిజానికి 'కరోనా వైరస్' రాకుండా ఉండి ఉంటే... ఈపాటికి కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం అమలుచేసి ఉండేదేమో..!
తెలంగాణాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా .. ప్రగతి భవన్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్
కొత్త రెవెన్యూ చట్టం... అవినీతికి చెక్ చెప్పే అస్త్రం..
రెవెన్యూ శాఖ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు సర్వత్రా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూములపై తహశీల్దార్లు,రెవెన్యూ డివిజన్ అధికారులు(RDO) పెత్తనానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తోంది. భూ పరిపాలనను కూడా కలెక్టర్లు,అడిషనల్ కలెక్టర్లకు అప్పగించేలా దీనికి రూపకల్పన చేసింది. ముఖ్యంగా భూ రికార్డుల్లో మార్పులు చేర్పులు, మ్యుటేషన్ల జారీ అధికారాలను అదనపు కలెక్టర్లకు బదలాయించనుంది.అలాగే కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులను వేరే శాఖలకు బదలాయించాలనుంది. ముఖ్యంగా తహశీల్దార్లను కొన్ని రకాల సర్టిఫికెట్ల జారీ,ప్రోటోకాల్ బాధ్యతలకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
డ్రాఫ్ట్ రెడీ...
గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తున్నారు.ఈ పాలసీ కోసం నల్సార్ లా వర్సిటీ ప్రొఫెసర్లు, రెవెన్యూ రిటైర్డ్ ఆఫీసర్లతో సంప్రదింపులు,చర్చలు జరపుతూ వస్తున్నారు. గత 150 చట్టాల్లోని అవసరమైన వాటిని తీసుకుని మార్పులు,చేర్పులతో ఇప్పటికే కొత్త డ్రాఫ్ట్ని సిద్దం చేశారన్న ప్రచారం ఉంది. అయితే కరోనా రూపంలో అనుకోని విపత్తు రావడంతో దీని అమలులో ఆలస్యం జరుగుతోంది. నిజానికి మున్సిపల్ చట్టంతో పాటే రెవెన్యూ పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ... అప్పటికి అది తుది రూపుకు రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
కీసర ఎమ్మార్వో పట్టుబడటంతో మరోసారి చర్చ
కీసర ఎమ్మార్వో నాగరాజు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటంతో మరోసారి రెవెన్యూ శాఖలో అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలోని సర్వే నంబర్లు 604,614 నంబర్లలో ఉన్న 28 ఎకరాల వివాదాస్పద భూమిని అంజిరెడ్డి,శ్రీనాథ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు నాగరాజు రూ.2కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఏఎస్ రావు నగర్లోని ఓ నివాసంలో నాగరాజు అంజిరెడ్డి,శ్రీనాథ్ల నుంచి రూ.1కోటి లంచం. తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నెల క్రితమే ఎమ్మార్వో సుజాత...
నెల క్రితమే హైదరాబాద్లోని షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత కూడా రూ.50లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నం.14 లోని ఓ వివాదాస్పద భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కారు. ఇక గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. సురేష్ అనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన భూమి రిజిస్ట్రేషన్ కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్న కథనాలు వచ్చాయి. అతని బంధువులు కూడా విజయా రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే అసలు నిజమేంటన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు.
Recommended Video
విజయారెడ్డి సజీవ దహనం తర్వాత...
ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటన తర్వాత రాష్ట్రంలో పలువురు రైతులు తహశీల్దార్ కార్యాలయాలకు పెట్రోల్ బాటిళ్లతో వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు తిరగబడి తమ భూముల కోసం ఎమ్మార్వోలను గట్టిగా నిలదీశారు.దీంతో కొంతమంది ఎమ్మార్వోలు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసుకుని మరీ విధులు నిర్వర్తించారు. కొన్నిచోట్ల ఎవరినీ నేరుగా అనుమతించకుండా కార్యాలయ ద్వారానికి అడ్డుగా తాళ్లు కట్టిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖపై పదేపదే అవినీతి వ్యాఖ్యలు చేయబట్టే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలూ వినిపించాయి. ఏదేమైనా రెవెన్యూ శాఖలో అవినీతి సామాన్యులను తీవ్రంగా వేధిస్తుందన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త రెవెన్యూ చట్టంతో దీనికి చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.