మొద్దు నిద్ర : బంగారంలాంటి భూమిపై ప్రైవేట్ కేసు.. సుప్రీం ఆదేశంతో ఫైళ్ల తనిఖీలు
దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకునే వరకు రెవెన్యూశాఖ మొద్దు నిద్ర పోతుండటం వల్లే రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై హక్కు కోసం పోరాడుతున్నాయి.
హైదరాబాద్: దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకునే వరకు రెవెన్యూశాఖ మొద్దు నిద్ర పోతుండటం వల్లే రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై హక్కు కోసం పోరాడుతున్నాయి. 50 ఏళ్లుగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరు వర్గాల మధ్య ఈ న్యాయ పోరాటం సాగుతున్నా తెలియనట్లు రెవెన్యూశాఖ వ్యవహరిస్తుండటం విచిత్రం. ఆ ఆస్తిని వేలం వేయాలని సుప్రీం ఆదేశించడంతో కళ్లు తెరిచిన రెవెన్యూ శాఖ.. ఫైళ్ల దుమ్ముదులిపి చూస్తే వారి దిమ్మ తిరిగే చేదు నిజాలు బయటపడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మియాపూర్లో అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన ప్రభుత్వ భూమి వ్యవహారంలో జరిగిన కథ ఇది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమయ్యాక పలువురు ఇక్కడి ఆస్తులను, భూములను వదిలిపెట్టి హైదరాబాద్ను వదిలి పాకిస్తాన్ వెళ్లిపోయారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇటువంటి వారికి చెందిన వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి దఖలు పడింది. మియాపూర్ పరిధిలో ఉన్న ఇలాంటి భూమిలో 693 ఎకరాలను కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ప్రైవేటు వ్యక్తుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఈ భూమితో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో దాదాపు 1,000 ఎకరాల భూమికి కొంతమంది వ్యక్తులు 50 ఏళ్ల కిందటే తప్పుడు ధ్రువప్రతాలను సృష్టించారు. వాటి యజమానులు పాకిస్థాన్కు వెళ్లే ముందు ఆ భూముల్ని తమకు విక్రయించారని వారు చెబుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్లోని కింది కోర్టు మొదలు హైకోర్టు వరకు చివరికి సుప్రీం కోర్టు వరకు న్యాయపోరాటం సాగిస్తున్నారు. సాధారణంగా ఇటువంటి కేసుల్లో ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేరుస్తుంటారు. దీనికి భిన్నంగా ఈ రెండు వర్గాలు భూమి తమదంటే తమదని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాయే తప్ప ప్రభుత్వాన్నిచేర్చలేదు. తమను ప్రతివాదిగా చేర్చకపోవడంతో రెవిన్యూ శాఖ కూడా ఈ కేసు గురించి పట్టించుకోలేదు.
మార్చిలో సుప్రీం కీలక ఆదేశాలు
ఈ భూముల వివాదంలో గత మార్చిలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు ప్రైవేట్ వర్గాలు ఈ భూమి తమదంటే తమదని చెప్తున్నాయి కాబట్టి భూమిని వేలం వేసి సొమ్మును ప్రత్యేక అకౌంట్లో జమ చేయానిల ఆదేశించింది. అంతేకాదు ఈ వేలం పర్యవేక్షణ బాధ్యతను పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి అప్పగించింది. 20, 28, 100, 101 సర్వే నంబర్లలోని కొన్ని భూములను కొన్నేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి హుడా (నేటి హైదరాబాద్ మహానగరాభివృద్ధిసంస్థ -హెచ్ఎండీఏ)కు అప్పగించింది. ఇందులో కొన్ని భూముల్లో ఈ సంస్థ వెంచర్లు వేసింది విక్రయించింది కూడా.
50 ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన రెవెన్యూశాఖ
మియాపూర్ భూముల వేలంపై సుప్రీం కోర్టు ఆదేశాల విషయం తెలిసిన వెంటనే హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత రెవిన్యూశాఖ అప్పుడు స్పందించింది. హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖ హడావుడిగా గత మార్చిలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా ప్రమాణపత్రాలు దాఖలు చేశాయి. రికార్డుల ప్రకారం ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని పలు పత్రాలను కోర్టు ముందు ఉంచాయి. దీంతో వేలం నిర్ణయాన్ని వాయిదా వేసిన సుప్రీంకోర్టు ముందు టైటిల్ ఎవరదన్నది హైదరాబాద్ జిల్లా సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. దీంతో రెవిన్యూ, హెచ్ఎండీఏలు వూపిరి పీల్చుకున్నాయి. దీంతో మొత్తం వ్యవహారం కింది కోర్టుకు వచ్చింది. కింది కోర్టులో వాదనలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
పోరాడుతున్నామన్న హెచ్ఎండీఏ కమిషనర్
ఈ భూములకు సంబంధించిన వ్యాజ్యంలో మమ్మల్ని ప్రతివాదులుగా చేర్చకపోవడంతో హైకోర్టులో కేసు సాగేటప్పుడు కూడా రెవిన్యూ శాఖతోపాటు తాము కూడా ఇందులో ఇంప్లీడ్ కాలేదని హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. సుప్రీంకోర్టు వేలం ఆదేశాలతో ఇంప్లీడ్ అయి అసలు విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చామన్నారు. భూముల పరిరక్షణకు తామూ పోరాడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన కేసుల్లో కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు, మరో ఇద్దరు బడాబాబులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం 'సీఐడీ'కి అప్పగించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.