విజయారెడ్డిపై దాడిని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన, డీజీపీ, హోంమంత్రికి ఫిర్యాదు,
తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయటకొచ్చి.. రహదారిపై నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేశ్ హయత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనిని పోలీసులు విచారిస్తున్నారు.
ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు అదనపు పనిభారం కల్పించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్జిదారులు పనులు ఆలస్యమవడంతో.. ఉద్యోగులపై భౌతికదాడులకు దిగడం సరికాదంటున్నారు. తమ పని ఒత్తిడిని మాత్రం ఆర్జిదారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో సమస్య తలెత్తుందుని చెప్పారు.
భద్రతా ప్రశ్నార్థకం
విజయారెడ్డిపై దాడితో తోటి మహిళా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. దీనిపై నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ డీజీపీ, హోంమంత్రిని కలిసి విన్నవించనున్నారు. మరోవైపు ఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. వెంటనే విచారణకు ఆదేశాలు జారీచేసింది. ఘటనాస్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.
హేయనీయం
అబ్దుల్లాపూర్మెట్లో తహశీల్దార్పై దాడిని రెవెన్యూ, తహశీల్దార్ల సంఘం తీవ్రంగా ఖండించింది. హేయనీయమైన చర్య అని మండిపడింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. విజయారెడ్డి మృతిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో భూముల విలువ పెరగడం, రిజిస్ట్రేషన్కు సంబంధించి లోపాభూయిష్టలే దాడికి దారితీసిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
దాడులే.. కానీ...
రాష్ట్రంలో ఇదివరకు అధికారులపై దాడులు జరిగాయే తప్ప.. హత్యలు మాత్రం చేయలేదన్నారు. కానీ అబ్దుల్లాపూర్మెట్లో నిందితుడు సురేశ్ పైశాచికంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు తమ భద్రత గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమకు అన్ని పనులు అప్పగిస్తూ.. తమ పని చేయనీయడం లేదని చెప్తున్నారు.
కారణమిదే..
సురేశ్ భూమి రిజిష్ట్రేషన్ ఆలస్యం కావడంతో తహశీల్దార్ విజయారెడ్డిపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రిజిస్ట్రేషన్ కోసం విజయారెడ్డి పలుమార్లు తిప్పించుకున్నారని సమాచారం. పెద్ద మొత్తంలో లంచం అడగడం, ఇచ్చే స్థోమత సురేశ్కు లేకపోవడంతోనే దాడికి దిగినట్టు సమాచారం.