అన్ని శాఖలకు తల్లి లాంటిది.. మా శాఖనే రద్దు చేస్తారా..!.. సీఎంపై రెవెన్యూ ఉద్యోగుల గుస్సా
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీరుపై రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆ శాఖను రద్దు చేస్తామన్నారని, ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంకల్పాన్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని ఫైరవుతున్నారు. అన్ని శాఖలకు తల్లిలాంటిదైన రెవెన్యూ శాఖను రద్దు చేయడం ఎవరి తరం కాదంటున్నారు. కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇతర ఉద్యోగ సంఘాల సహకారం కూడా తీసుకుంటామన్నారు.
కేసీఆర్కు కూడా "రిటర్న్ గిప్ట్" వస్తోందా!.. టీఆర్ఎస్ మాజీ నేత కీలక వ్యాఖ్యలు
సీఎం వ్యాఖ్యలపై గుస్సా
రెవెన్యూ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ శాఖ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం మాట్లాడిన తీరు ఒక రెవెన్యూ ఉద్యోగులను మాత్రమే కాదు.. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులందరిని అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. రెవెన్యూ శాఖను రద్దు చేయాలన్న కేసీఆర్ యోచన సరికాదని మండిపడ్డారు.
రెండు రోజుల కిందట భూమి సమస్యకు సంబంధించి.. యువరైతు శరత్ తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన సందర్భంగా తమను కించపరిచేలా మాట్లాడారని ఉద్యోగులు ఫైరవుతున్నారు. వానిది వీనికి రాసి... వీనిది వానికి రాసి.. సాయంత్రం కాగానే డబ్బులు జేబులో పెట్టుకొని పోవడం వీఆర్వోలకు రివాజుగా మారిందని కేసీఆర్ వ్యాఖ్యానించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకితభావంతో పనిచేస్తున్న తమ సంకల్పాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తగదన్నారు.
అప్పుడు పొగిడారు.. ఇప్పుడేమో..!
ఇదివరకు బాగా పనిచేశారంటూ తమ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఇలా మాట్లాడటమేంటని వాపోయారు. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎంత పని వత్తిడి ఉన్నా.. సెలవులు తీసుకోకుండా పనిచేశారని, అనారోగ్యానికి గురైన విధినిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారని తమకు కితాబిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు నిందించడం సరికాదన్నారు.
మంచిర్యాల జిల్లాలోని భూవివాదానికి సంబంధించి వన్ సైడ్ వాదన విని.. మొత్తం రెవెన్యూ వ్యవస్థపై నిందలు మోపడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. రెండు వైపులా వాదనలు వింటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వెబ్ ల్యాండ్ లో భూరికార్డులకు సంబంధించి తప్పులకు ఆస్కారం లేదని, సాంకేతిక లోపాల వల్ల జరిగే తప్పులకు తమను బలి చేయడమేంటన్నారు. భూరికార్డుల నవీకరణలో తప్పులను సరిచేసే అధికారం తహసీల్దార్ కు ఇవ్వకుండా నాన్చడం వల్లే రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
ధరణి లోపభూయిష్టం..! మాపై నిందలా?
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్న క్రమంలో.. సీఎం కేసీఆర్ నిందించడం బాధాకరంగా ఉందన్నారు. ధరణి వెబ్సైట్లో సాంకేతిక తప్పిదాల వల్లే భూ వివాదాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. యూజర్ ఫ్రెండ్లీగా లేని వెబ్సైట్ను రెవెన్యూ శాఖపై రుద్ది.. సిబ్బందిని బలి చేయడమేంటని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తామనే నిర్ణయంపై ప్రభుత్వం పునారాలోచన చేయాలని కోరారు.