మరో రెండు రోజులు రెవెన్యూ సేవలు బంద్...! రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహానానికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన రెవెన్యు ఉద్యోగులు మరో రెండు రోజులు తమ విధులను బహిష్కరించి ఆఫీసుల్లో బంద్ పాటిస్తామని రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. కార్యాలయాల బంద్తో పాటు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరహార దీక్షలు చేస్తామని తెలిపారు. నిరసన కార్యాక్రమాల్లో తహసీల్దార్లు, వీఆర్ఓ, వీఆర్ఏ మరియు ఇతర రెవెన్యూ సర్వీసులకు చెందిన ఉద్యోగులు పాల్గొనున్నట్టు ప్రకటించారు.
తహాసీల్దార్ హత్యతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన మరింత ఉదృతం చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. విజయారెడ్డి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఉద్యోగులకు భద్రత కల్పించడం తోపాటు ,రెవెన్యూ శాఖలోని సాంకేతిక పరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టనున్నారు. ఉద్యోగులు పెట్టిన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రెవెన్యూ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు.
మరోవైపు విజయారెడ్డి మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఉద్యోగసంఘాల జేఏసీ డిమాండ్ చేస్తుంది. బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు ఆమే కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక డ్రైవర్ గురనాథం కుటుంబానికి అదుకునేందుకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఆయన కుటుంబానికి ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని ప్రకటించారు.