రెవెన్యూ అధికారుల చేతివాటం .. ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్యా యత్నం
తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి సాయం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు అండగా ఉంటానని ప్రకటించింది. అయితే రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించటానికి ముందు కొందరు రైతులకు ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చెయ్యాల్సి ఉంది. అయితే అధికారులు పట్టా దారు పాసు పుస్తకాల మంజూరులో అవకతవకలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే తెలంగాణా సీఎం కేసీఆర్ మొత్తం రెవెన్యూ శాఖనే ప్రక్షాళన చెయ్యాలని నడుం బిగించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన ఎంపీలు పార్టీని బలోపేతం చేస్తారా ?
సాక్షాత్తు సీఎం రెవెన్యూ శాఖ మీద ఆగ్రహం వ్యక్తం చేసినా రెవెన్యూ అధికారుల పని తీరు ఏ మాత్రం మారటం లేదు. ఈ నేపధ్యంలోనే భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొమరం భీం జిల్లా రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అధికారుల చేతివాటం తనకు నష్టం చేసిందని లబోదిబోమంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తేకిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాంబయ్య, దుర్గం రాజయ్యలు అన్నదమ్ములు. వీరికి 28 ఎకరాల వారసత్వ భూమి ఉంది. ఈ భూమి ఇరువురికి సమానంగా రావాల్సి ఉండగా అధికారులు చేతివాటం చూపించారు. దుర్గం రాజయ్య కుటుంబ సభ్యులైన దుర్గం సోమక్క, దుర్గం మల్లయ్య, దుర్గం ప్రభాకర్ల పేర్లపై పట్టా చేశారు.
దాంతో సాంబయ్య కుటుంబ సభ్యులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోగా, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటంతో విసుగు చెందిన సాంబయ్య కొడుకు దుర్గం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. అయినా అధికారులు స్పందించకపోవడంతో కిరోసిన్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. అక్కడే ఉన్న రైతులు శ్రీనివాసనుఅడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది. రికార్డులన్నీ పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.