రగులుతున్న 'వైరం': వరంగల్ రాజకీయంలో చిచ్చు, కొండా వర్సెస్ ఎర్రబెల్లి..
తమ శత్రువు ఎర్రబెల్లి కావాలనే జిల్లాలో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని వారు భావిస్తున్నారు.
వరంగల్: వరంగల్ రాజకీయంలో ఎర్రబెల్లి-కొండా దంపతుల మధ్య వైరం మళ్లీ రాజుకుంటున్నట్టే కనిపిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల శత్రుత్వం ఉన్న ఈ ఇరువురు ఒకే పార్టీలో కొనసాగాల్సిన అనివార్యత ఏర్పడటం జిల్లా రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలకు తావిస్తోంది.
Recommended Video
టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి తన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును బరిలో దించాలని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతుండటంతో వరంగల్ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖకు ఈ వ్యవహారం మంట పుట్టిస్తోంది. తమ శత్రువు ఎర్రబెల్లి కావాలనే జిల్లాలో ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని వారు భావిస్తున్నారు.
కడియం, కొండా, ఎర్రబెల్లి: వరంగల్లో ఒకే ఒర, 3కత్తులు
కొన్ని ఎర్రబల్లులు కావాలనే:
టీఆర్ఎస్ పార్టీ తమకు పునర్జన్మ ఇచ్చిందని, అలాంటి పార్టీని వదిలే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుపై పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు.
పార్టీలో తయారైన కొన్ని ఎర్ర బల్లులు వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ నుంచి పోటీ చేయదు అనే ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కొండా మురళికి ప్రాణం ఉన్నంత వరకు సురేఖ వరంగల్ నుంచి పోటీలో ఉంటుందని తెలిపారు. తన కూతురు సుస్మిత భవిష్యత్తు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.
30ఏళ్ల వైరం మాది
ఎర్రబెల్లి కుటుంబంతో తమకు 30 సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉందన్నారు కొండా సురేఖ. తమను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న కొద్ది తాము మరింత పైకి ఎదుగుతున్నామని గుర్తుచేశారు. ప్రజల్లో లేని పోని అనుమానాలు రేకెత్తించి రాబోయే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రచారం చేసుకుంటున్నారని, ఇలా తమపై బురద జల్లడం సరికాదని అన్నారు.
ఎర్రబెల్లి వర్సెస్ కొండా వైరం:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్రావు, కొండా మురళీ మధ్య నడిచిన రాజకీయాల గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేయడానికి ఒకరిని మించి మరొకరు ఎత్తులు వేసేవారని చెబుతారు. ముఖ్యంగా టీడీపీ తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో ఎర్రబెల్లి కొండా దంపతులు చాలానే టార్గెట్ చేశారని అంటారు. వీరిద్దరి మధ్య హత్యా రాజకీయాలు జరిగినట్టు కూడా చెబుతారు. ఎర్రబెల్లి అనుచరుడు ప్రతాప్ రెడ్డి హత్య కేసులో కొండా మురళి జైలుకు కూడా వెళ్లారు.
మురళిని ఎన్కౌంటర్ చేయాలని:
కొండామురళితో ఉన్న వైరం నేపథ్యంలో ఆయన్ను దెబ్బతీసేందుకు ఎర్రబెల్లి కూడా చాలానే ప్రయత్నాలు చేసినట్టు చెబుతారు. మురళికి నక్సలైట్లతో సంబంధాలుండేవన్న ప్రచారం నేపథ్యంలో.. అప్పట్లో ఆయన్ను ఎన్కౌంటర్ చేయించే ప్రయత్నాలు కూడా జరిగాయంటారు. అప్పట్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు వచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొండా దంపతులకు అండగా నిలబడటంతో మురళి ఎన్కౌంటర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అంటారు.
ఏదేమైనా ఏళ్లుగా శత్రువులుగా ముద్రపడ్డ కొండా దంపతులు, ఎర్రబెల్లి ఒకే పార్టీలో ఉండాల్సి రావడం పాత విభేదాలను పదేపదే గుర్తుచేస్తోంది. దానికి తోడు ఎర్రబెల్లి వైఖరి కూడా కయ్యానికి కాలు దువ్వినట్టే ఉండటంతో భవిష్యత్తులో వీరి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ కూడా మొదలైంది.