గడ్డపోళ్లు ఒక్కటయ్యారు, ఒక్కదెబ్బకు ఇద్దరికీ: ఎన్టీఆర్ను లాగి చంద్రబాబుపై కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణను అడ్డుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కటయ్యారని, తెలంగాణ ప్రజలకు ఒక్క దెబ్బకు ఇద్దరిని తిరస్కరించే మంచి అవకాశం వచ్చిందని తెరాస నేత కేటీఆర్ బుధవారం అన్నారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
పవన్ సీక్రెట్ మీటింగా? ఇదిగో ఆధారం!: 'వారి అజ్ఞానానికి చింతిస్తున్నాం'
టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నేను కేసీఆర్ను గద్దె దించే వరకు గడ్డం తీయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారని, కానీ ఆయన అలా చేయడం వల్ల ఎవరికీ బాధ లేదన్నారు. అయితే గియితే కేవలం ఆయన మంగళి వారికి బాధ ఉంటుంది కావొచ్చన్నారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పి
గెడ్డం పెంచగానే ఎవరూ గబ్బర్ సింగ్లు కాలేరని కేటీఆర్ అన్నారు. మరో నేత మాట్లాడుతూ.. రేపే ఎన్నికలు పెట్టండి మేం సిద్ధమని చెప్పారని, కానీ ఇప్పుడు ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ పదవులు వదులుకోవడానికి ఇష్టపడదని, తాము మాత్రం ఎనిమిది తొమ్మిది నెలలు వదులుకున్నామన్నారు.
గడ్డపోళ్లు ఒక్కటయ్యారు... ఎన్టీఆర్ ఆశయాలకు బొంద పెట్టారు
ఇద్దరు గడ్డపోళ్లు.. చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒక్కటయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు అడ్డంపడ్డ వాళ్లు ఇప్పుడు ఏకమయ్యారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. అన్నగారు నాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు పార్టీ పెడితే, ఇప్పుడు చంద్రబాబు అదే పార్టీతో చేయి కలిపారన్నారు.
ఇద్దరినీ ఒకే దెబ్బకు కొట్టే అవకాశం
ఉత్తమ్, ఎల్ రమణలు కలిసి మాట్లాడుకుంటుంటే తనకు చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఎందుకంటే ఒక్క దెబ్బకు ఇద్దరికి బుద్ది చెప్పే అవకాశం తెలంగాణ ప్రజలకు దొరికిందని చెప్పారు. ఇద్దరినీ ఒకే దెబ్బతో కొట్టే అవకాశం మనకు వచ్చిందన్నారు. ఈ జుగుప్సాకరమైన, అపవిత్రమైన, నీచమైన కలయిక వల్ల ప్రజలకు ఓ సువర్ణావకాశం దొరికిందన్నారు. ఇక ప్రజలు తేల్చుకుంటారన్నారు.
కాల్పులు జరిపిన వారు ఒక్కటయ్యారు
కాంగ్రెస్ యాభై ఏళ్లు, టిడిపి 15 ఏళ్లు పాలించిందని, కానీ తెరాస కేవలం నాలుగేళ్లే పాలించిందని కేటీఆర్ అన్నారు. బషీర్ బాగ్లో రైతుల పై కాల్పులు జరిపిన చంద్రబాబు, ముదిగొండలో కాల్పులు జరిపిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కటయ్యాయని చెప్పారు. తాము మాత్రం రైతులను ఆదుకుంటున్నామన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ దురాఘతాలు ఒకటి రెండు కాదని, చాలా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు వల్ల తెలంగాణ ప్రజలకు మంచి అవకాశమన్నారు. ఒక్క దెబ్బకు ఇద్దరిని వాయించవచ్చన్నారు.
ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ ఇలా
ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లామని చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటలో ఒకసారి తొండి చేస్తే ఊరుకుంటామని, కానీ నాలుగేళ్లుగా ఇలాగే చేస్తే.. మళ్లీ ముందు నుంచి ఆడుదామని అంటారని, తాము కూడా అలాగే ముందస్తుకు వచ్చామని అభిప్రాయపడ్డారు. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పారు. మనకు ఓ దౌర్భాగ్యమైన ప్రతిపక్షం ఉందన్నారు. అరవై ఏళ్లు రాబందుల్లా పీక్కుతున్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. ప్రజా కోర్టును మించిన కోర్టు లేదన్నారు. విపక్షాలకు తగిన శాస్తి చెప్పాలనే అసెంబ్లీని రద్దు చేశారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరు తెరాసకు మద్దతివ్వాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీకి అడుగు దూరంలో నిలిచామని కేటీఆర్ చెప్పారు.
ఝాన్సీ చేరికతో సెంచరీ
కార్పోరేటర్ ఝాన్సీ చేరికతో సెంచరీ సాధించామని కేటీఆర్ చెప్పారు. కొండగట్టు ఘోర ప్రమాదం కారణంగా కేసీఆర్ ఇక్కడకు రాలేకపోయారని చెప్పారు. తెలంగాణ పోరాటం జరిగిందే అస్తిత్వం కోసమని చెప్పారు. తెలంగాణ వాళ్లే తెలంగాణను పాలిస్తే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మన వాదన అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఢిల్లీ చేతుల్లో ఉందామా లేక తెరాసను గెలిపించి మన అధికారం మన చేతుల్లో ఉంచుకుందామా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు తాగునీరు ఇవ్వకుండా చేసిన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయన్నారు.