ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
కొమురంభీం: కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద వంతెన పైనుంచి బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కైరిగూడ ఆర్చ్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ వైపు వెళ్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి బోల్తా పడింది. ప్రమాదానికి గురైన వాహనం సింగరేణి సంస్థలో పనులు నిర్వహించే వాహనంగా గుర్తించారు.
మృతదేహాలను అసిఫాబాద్ తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, వారి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరి ప్రాణం తీసిన వేగం
అతివేగం కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. లారీ రూపంలో వచ్చిన మృత్యువు జాగ్రత్తగా వెళ్తున్న వారి ప్రాణాలను తీసింది. చెన్నూరు మండలం చింతలపల్లి బతుకమ్మవాగు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. వరిగడ్డిని తరలిస్తున్న ట్రాక్టర్ను వెనకాల నుంచి లారీ వచ్చి ఢీకొట్టడంతో రాంశెట్టి రాజబాపు(28), గడిపెల్లి బానయ్య(38) మృతి చెందారు.