జడ్చర్లలో ఘోర ప్రమాదం: ట్రాక్టర్, బైక్స్ను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి
మహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. రెండు ద్విచక్ర వాహనాలను, ఓ ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్ వైపు వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ.. ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా ఢీకొంది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ట్రాక్టర్ డ్రైవర్ కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
మృతులను గంగాపూర్కి చెందిన రవి, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్కు చెందిన సురేష్, ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి
మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుండ్ల పోచంపల్లికి చెందిన రమేష్(41) సుచిత్రలోని హర్ష ఆస్పత్రిలో వైద్యుడగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా కొంపల్లి ఫ్లైఓవర్పై ఓ గేదె అడ్డు రావడంతో దాన్ని ఢీకొని కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన లారీ రమేష్ పై నుంచి దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.