పెళ్లై నెల కూడా కాలేదు: కొత్త జంటను వెంటాడిన మృత్యువు
కరీంనగర్: ఎన్నో ఆశలు.. మరెన్నో ఊసులు, కలలతో కొత్తగా దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన ఆ జంటను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ కొత్త జంట మరణంతో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది.
ఈ ఘటన జగిత్యాల మండలం చల్గల్-తాటిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లి వచ్చిన జగిత్యాల మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన నాగపూరి నరేశ్ (25), సారంగపూర్ మండలం తుంగూరుకు చెందిన మంగ(23)లకు ఆగస్టు 23న వివాహం జరిగింది.
కాగా, మంగళవారం దంపతులిద్దరూ బైక్పై మేడిపల్లి మండలం కొండాపూర్లోని నరేశ్ అమ్మమ్మ ఇంటికెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు వెంటాడింది.
నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ.. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. తాటిపల్లి గ్రామస్థులు లారీని వెంబడించి మేడిపల్లి వద్ద పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నవదంపతుల మృతితో ఇరు కుటుంబాలతోపాటు వారి రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.