ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి, నవవధువు ఆత్మహత్య
ఆదిలాబాద్: జిల్లాలోని జైపూర్ మండలం బీమారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను అదుపుతప్పి ఓ టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రున్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆటో చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను చెన్నూరు వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డుపై రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి కొత్తుర్ వెళ్తున్న బొగ్గులారీ టైర్ పంచర్కు గురైంది. టైర్ మార్చుతుండగా వెనకనుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ మృతిచెందగా క్లీనర్కు గాయాలైయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
నవ వధువు ఆత్మహత్య
రంగారెడ్డి: శంషాబాద్ కాముని చెరువులో నవ వధువు దూకి ఆత్మహత్య చేసింది. నవ వధువు ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతురాలిని శంషాబాద్ సిద్ధేశ్వర కాలనీకి చెందిన సుగుణ(22)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుగుణ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.