ఎమ్మెల్యే శంకర్ నాయక్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ఘటన!
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకుని తిరిగి వస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకుని తిరిగి వస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
పస్రా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో కారులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెళ్లిపోయారు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
మరోవైపు మేడారం మహా జాతర నాలుగో రోజు ఘనంగా కొనసాగుతోంది. జాతరకు శనివారం ఆఖరిరోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. పూజల అనంతరం దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది.