మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి బంధువుల ఇంట్లో దొంగలు పడ్డారు..!
హైదరాబాద్: మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సోదరుని కుమార్తె ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లిహిల్స్లో బుధవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనలో దాదాపు రూ. కోటికిపైగా విలువ చేసే నగలు, నగదు అపహరణకు గురైనట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 56లో నివసించే మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సోదరుని కుమార్తె దివ్యారెడ్డి నివాసం ఉంటోంది. ఈమె గతనెల 4న అమెరికా వెళ్లింది. తిరిగి జూన్ 17న నగరానికి వచ్చింది.
నగరానికి చేరుకున్న అనంతరం ఆభరణాల గురించి వెతకగా అవి కనిపించలేదు. దీంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించిన దినేశ్ రెడ్డి సోదరుడు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు ఇంటికి వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.
అమెరికా వెళ్లే సమయంలో విలువైన ఆభరణాలను ఓ బ్యాగ్లో ఉంచి తల్లివద్దకు పంపించానని, అందులో ఆభరణాలు ఉన్న విషయం తెలియక తిరిగి అమ్మ వాటిని తన ఇంటికే పంపించి వేసిందని ఈ మధ్యలోనే ఆ ఆభరణాలు చోరికి గురై ఉంటాయని, అపహరణకు గురైన ఆభరణాల విలువ సుమారు 80 లక్షల పైనే ఉంటుందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో జూబ్లిహిల్స్లో పరిధిలో దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి.