సిగ్నల్ కట్ చేసి.. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో దోపిడీ, మహిళల గొలుసులు లాక్కెళ్లారు
హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ జరిగింది. రైలు మహబూబునగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్లో నిలిచిన సమయంలో దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు.
ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలు కిటికీల నుంచి నగదు, నగలు దోచుకెళ్లారు. ఐదుగురు ప్రయాణికుల నుంచి మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోపిడీ చేశారు. మహిళా ప్రయాణికుల మెడల్లోంచి బంగారు గొలుసులను తెంచుకుని పరారయ్యారు.
రైలు కాచిగూడ చేరుకున్న అనంతరం బాధితులు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసినట్లు రైల్వే ఎస్పీ అశోక్కుమార్ అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని బృందాలు దొంగల వేట ప్రారంభించాయని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిగ్నల్స్ కట్ చేసిన అనంతరం దాదాపు 20 నిమిషాలపాటు రైలు దివిటిపల్లి రైల్వేస్టేషన్లో ఆగింది. ఈ సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి ఆరా తీశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.