పీహెచ్డీ స్కాలర్ రోహిత్ది ఏ కులం?: స్పష్టం చేసిన మాజీ మంత్రి డొక్కా
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల సామాజిక వర్గం (కులం)పై విభిన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రొహిత్ కులంపై స్పష్టత ఇచ్చారు.
రోహిత్ తల్లి మాల కులానికి చెందినది కాగా, తండ్రి బీసీ జాబితాలోని ‘వడ్డెర' కులానికి చెందిన వారని ఆయన అన్నారు. రొహిత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారని, ఆ తర్వాత ఆమె తన కుమారుడు రోహిత్తో కలిసిగురజాలలో నివసిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య: మరిన్ని వార్తల కోసం రోహిత్ వడ్డెర కులానికి చెందిన వాడేనని, దీనిపై ఎలాంటి రాజకీయం చేయొద్దని ఆయన మనవి చేశారు. మరోవైపు రోహిత్ నాన్నమ్మ రాఘవమ్మ మాట్లాడుతూ తాము వడ్డెర కులానికి చెందిన వారమని పేర్కొంది. తన కోడలు, కొడుకు సైతం వడ్డెర కులానికి చెందిన వారేనని ఆమె స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి రోహిత్ నానమ్మ మాటల వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనికి తోడు వేముల రాజ చైతన్య కుమార్కు సంబంధించిన పుట్టిన తేదీ దరఖాస్తు పత్రాలను కూడా ఒక విద్యార్ధి సంఘం విడుదల చేసింది. అందులో వారు తమ కులాన్ని వడ్డెరగా పేర్కొన్నారు.
రోహిత్ వేముల చదువులో మంచి మెరిట్ స్టూడెంటేనట. యూనివర్సిటీలో అతడు రిజర్వేషన్ కేటగిరీ కింద కాకుండా జనరల్ కోటాలోనే సీటు సాధించాడట. ఈ మేరకు మంగళవారం ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యలను ఊటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' ఆసక్తికర కథనాన్ని రాసింది.
జనరల్ కోటాలో సీటు సాధించిన రోహిత్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేకపోయిందట. అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వర్సిటీలో తగిన ఆధారాలు లేవని తెలుస్తోంది. అడ్మిషన్ సందర్భంగా తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడినేనని పేర్కొన్న రోహిత్, అందుకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం జత చేయలేదంట.
యూనివర్శిటీలో రోహిత్ సమర్పించిన ధ్రువపత్రాలను ఇపుడే తాము బహిర్గతం చేయలేమని యూనివర్శిటీ పాలకులు చెబుతున్నారు. రోహిత్ సమర్పించిన ధ్రువపత్రాల్లో వాస్తవాలు తేల్చాల్సింది తాము కాదని, సంబంధిత రెవిన్యూ అధికారులే ఆ వ్యవహారం చూడాలని యూనివర్శిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ ఘటనపై తీవ్రంగా కలత చెందిన విద్యార్ధి సంఘాలు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే వైస్ చాన్సలర్ను తొలగించాలని, అలాగే కేంద్ర మంత్రివర్గం నుండి బండారు దత్తాత్రేయను బర్తరఫ్ చేయాలని వారు కోరుతున్నారు.