హెచ్సియులో ఉద్రిక్తత: క్లాస్లకు వెళ్తుంటే అడ్డుకున్న ఏఎస్ఏ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు విద్యార్థులు రీసెర్చ్ కొనసాగిస్తామని చెప్పగా, ఏఎస్ఏ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సియులో కొద్ది రోజులుగా ఉద్రిక్తత కనిపిస్తోంది.
Pics: HCU లో ఉద్రిక్తత
చాలామంది విద్యార్థులు తమకు క్లాసులు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విద్యార్థులు రీసెర్చ్ కొనసాగిస్తామని చెబుతూ... క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్లారు.
వారిని ఏఎస్ఏ సభ్యులు అడ్డుకున్నారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయనకు న్యాయం జరిగే వరకు లోనికి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. క్లాసులకు వెళ్తున్న ప్రతి విద్యార్థిని ఏఎస్ఏ సభ్యులు అడ్డుకుంటున్నారు. క్లాసులను బహిష్కరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఇప్పటికే తమకు ఆలస్యం అవుతోందని, క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు చెబుతున్నారు. సైన్స్ విభాగం ఎదుట వారు బైఠాయించారు. ఇరువర్గాల విద్యార్థులు పోటా పోటీగా నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని ఏబీవీపీ ఇప్పటికే ఆరోపిస్తోంది.