ఎస్ఎఫ్ఐలో చిచ్చు పెట్టిన రోహిత్ ఆత్మహత్య ఇష్యూ: విసి ఎత్తుగడనా?
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అంశం ఎస్ఎఫ్ఐలో చిచ్చు పెట్టింది. ఆత్మహత్య చేసుకున్న రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేములకు న్యాయం జరగాలని కోరుతూ గత కొద్ది నెలలుగా ఉద్యమం చేస్తున్న కీలక నేతల్లో ఒకరైన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ సాహు ఎస్ఎఫ్ఐకి రాజీనామా చేశారు.
తాను ఎస్ఎఫ్ఐకి రాజీనామా చేసినట్టు రాజ్కుమార్ సాహు ప్రకటించగా, తమ సంఘంనుండి సాహును బహిష్కరించినట్టు ఎస్ఎఫ్ఐ సెంట్రల్ యూనివర్శిటీ కమిటీ నేతలు ఆదిత్య హరీష్, హరికృష్ణ ఎంఎస్ చెప్పారు. రాజ్కుమార్ సాహు స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా గత రెండు రోజుల క్రితం కూడా రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలని పోరాటాల్లో పాల్గొన్నాడని, ఏ రోజూ ఎస్ఎఫ్ఐ కమిటీ సమావేశాల్లో తన ఆలోచనలపై చర్చ పెట్టలేదని వారు వివరించారు.
అకస్మాత్తుగా కొత్త విషయాలను రాజ్కుమార్ సాహు ముందుకు తేవడం వెనుక విసి ప్రొఫెసర్ అప్పారావు ఎత్తుగడ ఉందని విమర్శించారు. ఎబివిపి నేతలు రాజ్కుమార్ సాహును బెదిరించి లేదా ప్రలోభపెట్టి లొంగదీసుకున్నట్టు తాము భావిస్తున్నామని చెప్పారు.
ఎస్ఎఫ్ఐ సామాజిక అంశాలపైనా, విద్యారంగ సమస్యలపైనా నిరంతర పోరాటాలు చేస్తోందని, ఆనాటి నుండి రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలని తాము పోరాటం చేస్తున్నామని ఎంఎస్ హరికృష్ణ చెప్పారు. విద్యారంగం సమస్యలపై పోరాటాలు చేసే ఎస్ఎఫ్ఐపై విష ప్రచారం చేయడం హేయమని అన్నారు. ఒక వ్యక్తి కోసం సంఘం ఆశయాలు పక్కనపెట్టడం సరికాదని అన్నారు.
కాగా, రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరగాలని రాజ్కుమార్ సాహు కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య కోణంలోనే కాకుండా అంతకుముందు, తర్వాత జరిగిన జరుగుతున్న అంశాలు అన్నింటిపైనా సమగ్ర విచారణ జరిగినపుడు వాస్తవాలు అన్నీ వెలుగుచూస్తాయని రాజ్కుమార్ అభిప్రాయపడ్డారు.
విశ్వవిద్యాలయం అభివృద్ధి కోణంలో కాకుండా, కొంత మంది విద్యార్థుల పోరాటాలు వ్యక్తిగత ప్రయోజనాలు సూచిస్తున్నాయని చెప్పారు. తాను ఎస్ఎఫ్ఐకి రాజీనామా చేసినా, విద్యార్థి కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతానని తెలిపారు. ఎఎస్ఎ, ఎస్ఎఫ్ఐలకు ఏదైనా ప్రతిది తమ స్వార్థం కోసమే పని చేస్తాయని విమర్శించారు.
అరుదుగా ఒక వ్యక్తి ప్రయోజనం, ఈ సంస్థ ప్రయోజనం ఒకటే అవుతుందని, అధికారం పొందడానికి, ప్రసిద్ధి చెందడానికి, నాలుగు గోడల మధ్య ముఖ్యంగా ఉండటానికి, మనం వ్యవస్థ మార్చడానికి అని ఆలోచించడానికి, తరచూ మన చర్యలను మితిమీరి అంచనా వేసుకుని మన ప్రత్యేక లక్షణాలతో ఉపశమనం పొందుతామని అన్నారు. కాగా ఎస్ఎఫ్ఐకి రాజీనామా చేసిన రాజ్కుమార్ ఎబివిపికి బాసటగా నిలిచినట్టు తెలుస్తోంది.