రోహిత్ ఆత్మహత్య: స్మృతి ఇరానీ విద్యార్థులను చల్లబరుస్తారా?
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో వేముల రోహిత్ ఆత్మహత్య జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 20వ తేదీన విద్యార్థులు రోడ్డెక్కనున్నారు.
'ఛలో ఢిల్లీ'కి కొందరు విద్యార్థులు ప్లాన్ చేశారు. ఇది జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో జరగనుంది. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట కూడా విద్యార్థులు ఆందోళనకు ప్లాన్ చేస్తున్నారు. ఆమె రాజీనామాకు వారు డిమాండ్ చేయనున్నారు.
వీరు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామాకు కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే సెలవుల పైన వెళ్లిన వీసీ అప్పారావును తొలగించాలని, అప్పటి దాకా తమ నిరసనలు ఆపే ప్రసక్తి లేదని చెబుతున్నారు.
గత నెల పదిహేడో తేదిన రోహిత్ వేముల ఆత్మహత్య చోటు చేసుకుంది. అప్పటి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. విద్యార్థులు క్లాసులకు వెళ్తున్నారు.
ఉగ్రవాది ఉరితీతకు మద్దతుగా ర్యాలీలు, ఏఎస్ఏ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య గొడవ నేపథ్యంలో ఐదుగురు స్కాలర్స్ను సస్పెండ్ చేశారు. అందులో వేముల రోహిత్ ఒకరు. ఆ తర్వాత వారిని క్లాసులకు అనుమతించారు. ఆ తర్వాత కేవలం హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు.
వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో జేఏసి నేతలు ఫిబ్రవరి 3న (బుధవారం) మాట్లాడుతూ... తాము దేశం మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నామని, రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఢిల్లీలో తాము చేస్తున్న నిరసనకు మద్దతుగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవరి 8వ తేదీ నుంచి తాము ప్రచారం ప్రారంభిస్తామని, ప్రతి విశ్వవిద్యాలయం నుంచి బస్సు యాత్రలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి బస్సులు వస్తాయని చెప్పారు. అలాగే ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ విద్యార్థి సభ్యులను కలుస్తామని చెప్పారు.
ఫిబ్రవరి 6వ తేదీన జెఏసీ హైదరాబాద్ యూనివర్సిటీలో సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొంటారు. ఓ వైపు వర్సిటీలో క్లాసులు ప్రారంభమైనప్పటికీ మరోవైపు కొందరు విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు.
నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు తమ అన్ని డిమాండ్లు నెరవేరే వరకు తగ్గరని జేఏసీ సభ్యులు తెలిపారు. కాగా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే అవకాశముందా? అనే చర్చ సాగుతోంది.