రోహిత్ మృతిలో ట్విస్ట్: సెలవులపై వెళ్లిన వీసీ అప్పారావు, ఖర్గే రివర్స్!
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్. వర్సిటీ వైస్ ఛాన్సులర్ అప్పారావు సెలవుల పైన వెళ్లారు. ఆయన స్థానంలో డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ బాధ్యతలు తీసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య కుదిపేసేస్తోన్న విషయం తెలిసిందే.
రోహిత్ బిసి అయితే విద్యార్థి కాదా: మల్లికార్జున ఖర్గే
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో న్యాయం కోసం హెచ్సియు విద్యార్థులు కొందరు నిరసన చేపడుతున్నారు. వీరి నిరసనకు కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వర్సిటీకి వెళ్లి విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు విద్యార్థులను, రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. దళితులు విద్యావంతులు కాకూడదని, వాళ్లు ఎప్పటికీ సేవకులుగా ఉండాలనే విధంగా బిజెపి వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రోహిత్ దళితుడు కాదని చెబుతున్నారని, బిసి అయితే విద్యార్థి కాదా అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామన్నారు.
కాగా, రోహిత్ దళితుడు అంటూ విపక్షాలు. బిజెపి పైన నిప్పులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, సర్టిఫికేట్ల ఆధారంగా అతడు బిసి అని, తల్లిదండ్రులు కూడా బిసి అని తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే.. బిసి అయితే విద్యార్థి కాదా అని మాట్లాడటం గమనార్హం.
విపక్షాలు దళిత విద్యార్థి అంటూ రాద్దాంతం చేస్తున్నాయని, చనిపోయింది ఎవరైనా తాము బాధపడుతున్నామని బిజెపి నేతలు చెప్పారు. దళిత పేరుతో బిజెపిని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని అంటున్నారు. చనిపోయింది ఎవరైనా బాధాకరమే అంటున్నారు.