స్మృతి ఇరానీపై వేముల రోహిత్ ఆత్మహత్య దెబ్బ!: మోడీ ప్లాన్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించి, జౌళీశాఖను అప్పగించారు. దీని వెనుక, ఆమె నిత్యం వివాదాస్పదమవుతుండటం ఓ కారణంగా చెబుతున్నారు. ప్రధానంగా మాత్రం వేముల రోహిత్ ఆత్మహత్య ఆమెను వెంటాడిందని చెబుతున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోహిత్ ఆత్మహత్యకు కారణాలు ఏవైనా... అందులోకి స్మృతిని లాగారు. బీజేపీని తప్పుబట్టారు. ఆ తర్వాత జేఎన్యూ, సిలబస్, ఆమె విద్యార్హత వివాదాలు కొనసాగాయి.
ప్రధానంగా ఆమెను హెచ్ఆర్డీ నుంచి తప్పించడానికి వేముల రోహిత్ ఆత్మహత్య బలంగా పని చేసిందని అంటున్నారు. అతను దళితుడు కాదని సర్టిఫికేట్లు, అతని తండ్రి చెబుతున్నప్పటికీ.. ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకు దూరం కాకుండా ఉండేందుకు ఆమెను పక్కన పెట్టారని అంటున్నారు.
వారిని శిక్షించండి: రోహిత్ మృతిపై స్మృతి ఇరానీని టార్గెట్ చేసిన రాహుల్
తన పని తాను చేసుకుపోకుండా వివాదాలకే స్మృతి ఎక్కువ ప్రాముఖ్యమివ్వడం మోడీకి నచ్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిహార్ విద్యాశాఖ మంత్రి ఇటీవల ట్విటర్లో డియర్ అంటూ ఆమెను సంభోదించడం, దానిని తప్పుబడుతూ ఆమె పెద్ద దుమారం సృష్టించడంతో మోడీ ఆగ్రహం చెందారు.
ఉన్న గొడవలు చాలవన్నట్లు రోజుకో కొత్త వివాదం గొడవ సృష్టిస్తున్న స్మృతికి గాలం వేయకపోతే రాబోయే కాలంలో మరింత నష్టం జరుగుతుందని పార్టీ అధ్యక్షులు అమిత్ షా, ఆరెస్సెస్ నాయకులు కూడా మోడీకి సూచించారని అంటున్నారు.
వేముల రోహిత్ ఆత్మహత్య, తదనంతర వివాదం సమయంలో స్మృతి ఇరానీ పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టినా అసలు సమస్యకు పరిష్కారం చూపలేకపోవడంతో దళితులు ఎక్కువగా ఉన్న యూపీలో వారి ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఆరెస్సెస్ నేతలు హెచ్చరించారని అంటున్నారు.
జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్మృతి ఇరానీ శాఖ మార్చడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పాడు. హెచ్సీయులో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన వల్లే స్మృతి శాఖ మార్పిడికి కారణమని చెప్పారు.
కాగా, యూపీలో దళితులను మంచి చేసుకోవడంలో భాగంగా కూడా స్మృతిని తప్పించినట్లవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత రెండేళ్లలో స్మృతితో పని చేయలేక ఆమె శాఖలో డజనుకు పైగా ఉన్నతాధికారులు వేరే శాఖకు వెళ్లిపోయారు.
సెంట్రల్ యూనివర్సిటీల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలనడం లాంటివి తప్ప విద్యా శాఖను కాషాయీకరణ చేయడంలో ఆమె విఫలమయ్యారని ఆరెస్సెస్ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.
అనిల్ కకోద్కర్లాంటి ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త కూడా ఆమెతో వేగలేక ఐఐటీ-ముంబై సంస్థ నుంచి వైదొలగడంపై బీజేపీ నేతలే విమర్శిస్తున్నారు. ఏవీ ఎలా ఉన్నా, తన శాఖ మార్పుపై లోకులు ఏదో ఒకటి అంటుంటారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించడం కొసమెరుపు.