వీసీని, కేంద్రమంత్రుల్ని ఎలా తొలగించాలి, ఎమోషన్ ఆధారంగానా: హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అంశంలో హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. వీసీ అప్పారావుతో పాటు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయను ఏ నిబంధన ప్రకారం తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ప్రశ్నించింది.
రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ప్రకారం వీసీని తొలగించాలని, కేంద్రమంత్రుల రాజీనామాలను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఎమోషన్స్ ఆధారంగా విచారణ జరపమంటారా అని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. ఏ నిబంధన ప్రకారం వారిని తొలగించాలో చెప్పాలని అడిగింది. పూర్తి అధ్యయనం తర్వాత వస్తే సోమవారం విచారిద్దామని చెప్పింది.
హెచ్సియులో ఉద్రిక్తత
విద్యార్థి సంఘాలు బుధవారం చేపట్టిన 'చలో హెచ్సీయూ' ఉద్రిక్తంగా మారింది. పలు విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు చాలామంది తరలివచ్చారు. హెచ్సియులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి జెఎసి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని, వీసీ అప్పారావును తొలగించాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా విద్యార్థుల పైన పైచేయి సాధించేందుకు వర్సిటీ అకడమిక్ కౌన్సెల్ సమావేశాన్ని వీసీ అప్పారావు ఏర్పాటు చేశారు. అధ్యాపకులంతా ఒక్కడిగా ముందుకు కదిలితేనే వర్సిటీల్లో పరిస్థితులు చక్కబడతాయని వీసీ సూచించారు. అయితే ప్రొఫెసర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వీసీగా అప్పారావు తీరును నిరసిస్తూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పని చేస్తున్న ప్రొఫెసర్ కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు.