బుద్ధిజం స్వీకరించిన వేముల రోహిత్ తల్లి రాధిక, సోదరుడు
హైదరాబాద్/ముంబై: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి నాడు వేముల రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజా బుద్దిజం తీసుకున్నారు. వారిద్దరు గురువారం నాడు ముంబైలో బౌద్ధ మతం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. వివక్షకు తావులేని బౌద్ధమతాన్ని స్వీకరించామని చెప్పాడు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా ఇదే ఉద్దేశ్యంతో తన జీవిత చివరి కాలంలో బౌద్దమతాన్ని స్వీకరించారని చెప్పాడు. వీరు అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సమక్షంలో బుద్ధిజం స్వీకరించారు.
కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్రవాది యాకూబ్ మెమెన్కు ఉరిని వ్యతిరేకిస్తూ రోహిత్ వేముల ట్వీట్లు పెట్టడం, ఏబీవీపీ నేతలతో వాగ్వాదం జరగడం తెలిసిందే. ఓ సమయంలో తనకు కాషాయం కనిపిస్తే కోపం వస్తందని చెబుతూ దానిని చించివేసిన వీడియోను ఏబీవీపీ రోహిత్ ఆత్మహత్య అనంతరం పోస్ట్ చేసింది.
తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ వేముల పేర్కొన్నాడు. ఏబీవీపీతో సైద్ధాంతికంగా విభేదించిన రోహిత్... కమ్యూనిస్టు నేతల తీరును కూడా తన సామాజిక అనుసంధాన పేజీలో తప్పుబట్టాడు. ఇది కూడా చర్చనీయాంశమైంది.