'స్మృతి ఇరానీ సహా వారికి ఇంకా శిక్షపడలేదేం' (పిక్చర్స్)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాది క్రితం వేముల రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాది క్రితం వేముల రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మంగళవారం నాడు అతని వర్ధంతి సభ ఉద్రిక్తతకు దారి తీసింది. యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రోహిత్ వేముల సంస్మరణ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రోహిత్ తల్లి రాధికతోపాటు మరికొందరిని ఈ సభకు ఆహ్వానించారు.
బయటి వ్యక్తులకు అనుమతులు లేవని..
కాగా వర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గతంలోనే బయటి వ్యక్తులకు అనుమతులు రద్దు చేస్తూ కోర్టు నిషేధం విధించింది. దీంతో సభకు విచ్చేసిన ప్రముఖులను ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు వచ్చి ఆందోళన చేపట్టారు.
వేధింపుల కారణంగానే..
ఈ సందర్భంగా జేఏసీ విద్యార్థులు మాట్లాడారు. వర్సిటీ మేనేజ్మెంట్ వేధింపుల కారణంగా వేముల రోహిత్ మృతి చెందాడని, ఇప్పటి వరకు అతడి మృతికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రోహిత్కు న్యాయం జరగలేదన్నారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర రావు, వీసీ అప్పారావులకు ఎలాంటి శిక్షలు పడకపోవడం దుర్మార్గమన్నారు.
నివాళులు
ఇదిలా ఉండగా, రోహిత్ వర్ధంతి సందర్భంగా వర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద అతని చిత్రపటానికి నివాళులర్పించారు. రోహిత్ స్థూపం వద్ద సభను నిర్వహించేందుకు ప్రయత్నించగా అనుమతులు లేవని సెక్యూరిటీ సిబ్బంది తెలపడంతో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.
వేముల రోహిత్ తల్లికి కూడా నో
రోహిత్ స్థూపాన్ని సందర్శించేందుకు అతని తల్లి రాధికను సైతం లోపలికి అనుమతించలేదు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమెను, పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కోర్టు తీర్పును లెక్క చేయకుండా వర్సిటీలోకి ప్రవేశించిన ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ జర్నలిస్టు కునాల్ శంకర్ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
వారికీ నివాళి
మరోవైపు, రోహిత్ తల్లి రాధికతో పాటు జేఎన్యూలో అదృశ్యమైన విద్యార్థి నజీబ్ సోదరులు, అక్లాక్ సోదరుడు జాన్ మహ్మద్, జేఎన్యూలో సస్పెండ్కి గురైన విద్యార్థి రాహుల్, హూనా బాధితులు, కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు విద్యార్థులకు మద్దతుగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.