నా కొడుకుపై దాడి: అప్పుడే కోర్టుకు ఏబీవీపీ సుశీల్ తల్లి, 'లేఖ'పై స్మృతి శాఖ వివరణ
హైదరాబాద్: తన కుమారుడి పైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దాడి జరిగిందని, అతనికి భధ్రత కల్పించాలని ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ తల్లి ఎన్ వినయ గత ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు.
తన బిడ్డపై దాడికి బాధ్యులైనవారిని శిక్షించాలనీ, హెచ్సీయూలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా యంత్రాంగాన్ని ఆదేశించాలని ఆమె కోరారు.
హాస్టల్ ప్రవేశాలకు అనుమతించాలని పిటిషన్
పరిశోధక విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాన్ని నిరాకరిస్తూ, హెచ్సియు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏఎస్ఏ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరపాలని, వారి తరఫున సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం మంగళవారం హైకోర్టును కోరారు.
దీనికి స్పందించిన హైకోర్టు జడ్జి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యం హైకోర్టులోని వేరే జడ్జి వద్ద ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ రెండింటినీ కలిపి విచారణ చేపట్టే విషయమై నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు రిజిస్ట్రీ సంబంధిత దస్త్రాన్ని తాత్కాలిక ప్రధాన జడ్జి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి భోజలే వద్ద ఉంచింది.
కాగా, రెండు కేసులపై విచారణను జస్టిస్ పివి సంజయ్ కుమార్కు కేటాయిస్తూ ఏసీజే నిర్ణయం తీసుకున్నారు. రెండింటిలో ఒకటి ఏఎస్ఏ విద్యార్థులది కాగా, మరొకటి హెచ్సీయూలోని ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ తల్లి దాఖలు చేసిన వ్యాజ్యం.
స్మృతి, దత్తాత్రేయలకు బిజెపి బాసట
హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలు రాజీనామా చేయాలనే కాంగ్రెస్, విపక్షాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిని బిజెపి తిరస్కరించింది. విద్యార్థి మృతిని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది.
రోహిత్ ఆత్మహత్య, అతనిపై హెచ్సియు తీసుకున్న కమ్రశిక్షణ చర్యలు, కేంద్ర మంత్రులపై విద్యార్థుల ఫిర్యాదుకు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. రాహుల్ గాంధీ హెచ్సీయూలో విద్యార్థుల దీక్షా శిబిరాన్ని సందర్శించడం నీతిబాహ్యమైన చర్య అని బిజెపి మండిపడింది.
కాంగ్రెస్, మీడియాలో ఒక వర్గం, కొన్ని స్వార్థశక్తులు రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థిపై విశ్వవిద్యాలయం తీసుకున్న చర్యలకు అతని సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని, ఇదేంత మాత్రం దళితులు, వారి హక్కులకు చెందిన విషయం కాదన్నారు.
కోర్టు ఆదేశాల మేరకే రోహిత్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు బిజెపి జాతీయ కార్యదర్శులు శ్రీకాంత్ శర్మ, సిద్ధార్థనాథ్ సింగ్లు ఢిల్లీలో మాట్లాడూతూ.. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
రాహుల్ గాంధీ హడావుడి హైదారబాద్ పర్యటనతో దళిత విద్యార్థి ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని, ఈ అంశంలో కాంగ్రెస్ చర్యలు ఆ పార్టీ దిగజారుడుతనాని నిదర్శనమని, మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్ను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు.
ఇరానీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలి
హెచ్సియులో రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలపై ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం వేటు వేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆ లేఖ నిబంధనల ప్రకారమే: హెచ్ఆర్డీ
ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ను ముందుగా సస్పెండ్ చేసే విషయంలో హెచ్సీయూపై తామెలాంటి ఒత్తిడి తీసుకురాలేదని హెచ్ఆర్డీ స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు 17న కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖపై కేంద్ర నిబంధనల ప్రకారమే హెచ్సీయూకు లేఖ పంపించామని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది.
దీనిని ఒత్తిడిగా చిత్రీకరించవద్దని, ఓ వీఐపీ నుంచి లేఖ వచ్చినప్పుడు అది అందినట్లుగా 15 రోజుల్లోగా ధ్రువీకరించి, మరో 15 రోజుల్లోగా దానికి సమాధానమివ్వాలని, దత్తాత్రేయ లేఖపై హెచ్సీయూ నుంచి స్పందన రాకపోవడంతో మంత్రిత్వశాఖ దాన్ని 4సార్లు గుర్తు చేసిందని, చివరకు జనవరి 7న సమాధానం అందిందని, ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని హెచ్ఆర్డీ శాఖ అధికార ప్రతినిధి ఘన్శ్యాం గోయెల్ వివరించారు.