హెచ్సీయూ వీసీగా మాట్లాడుతున్నా, కలిసింది ఎవరో: అప్పారావు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలోని రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రెండు నెలల క్రితం లాంగ్ లీవ్ల పైన వెళ్లిన వైస్ ఛాన్స్లర్ అప్పారావు మంగళవారం నాడు రెండోసారి వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాక నేపథ్యంలో హెచ్సియులో ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
దీనిపై ఆయన మధ్యాహ్నం మాట్లాడారు. మేం సమావేశం జరుపుకుంటుండగా కొందరు విద్యార్థులు తమను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, ఇంకొందరు విద్యార్థులు ప్రతిఘటించారన్నారు. ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. యూనివర్సిటీలో సమస్యలు కోర్టు ద్వారానే పరిష్కరించుకోగలమన్నారు.
ఓ వర్గం విద్యార్థులే తనను వీసీగా వద్దని చెబుతున్నారన్నారు. నన్ను వీసీగా వద్దనుకుంటే, మరేదైనా సమస్యలు ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. వర్సిటీలో మళ్లీ సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. మంచిపేరు ఉన్న వర్సిటీకి కొంతమంది విద్యార్థులు నష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
నేను వీసీగా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. తాను ఇప్పుడు మీడియాతో వైస్ ఛాన్సులర్గానే మాట్లాడుతున్నానని చెప్పారు. జ్యూడిషియల్ కమిషన్ జరిగినప్పుడు వీసీ ఉండవద్దని లేదని చెప్పారు. జడ్జి గారు వివరాలు సేకరించేటప్పుడు మేం దూరంగా ఉంటామని చెప్పారు.
సమస్యలకు పరిష్కారం చర్చలే మార్గమని చెప్పారు. తాను చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి కొందరు విద్యార్థులు తనను కలిసేందుకు వచ్చారని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చిన వారు ఏబీవీపీ విద్యార్థులా, ఎస్ఎఫ్ఐ విద్యార్థులా తనకు తెలియదన్నారు. తాను వీసీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించానని చెప్పారు.