ఓటుకు నోటు: చంద్రబాబుపై కేసు నిలబడేనా? అదే జరిగితే వైసీపీకి ఆయుధం
హైదరాబాద్/అమరావతి: ఓటుకు నోటు కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మూడో ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, మూడో ఛార్జీషీటులో చంద్రబాబు పేరును ఏ1గా చేర్చే అవకాశాలు లేకపోలేదనే వాదనలు ఉన్నాయి.
చదవండి: 'ఓటుకు నోటులో చంద్రబాబు పాత్ర, సుప్రీం కోర్టులో చెప్పిన స్టీఫెన్సన్'
అయితే చంద్రబాబుపై కేసు నిలబడేనా? ఆయన తేలిగ్గా బయటపడతారా? సాంకేతిక కారణాలతో కేసు ఏ మేరకు నిలబడుతోంది? మళ్లీ వాయిస్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. చాలా రోజుల తర్వాత ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: ఓటుకు నోటు కేసు, ఇదీ అసలు విషయం!: 'చంద్రబాబును ఎవరూ ఏం చేయలేరు'
సెబాస్టియన్ ఫోన్ నుంచి మాట్లాడారు
ఓటుకు నోటు కేసు నిలబడుతుందని, చంద్రబాబును ఏ1గా చేర్చే అవకాశాలు కొట్టి పారేయలేమని కొందరు అంటుంటే, ఇది చంద్రబాబుపై నిలబడటం కష్టమనే వారు కూడా లేకపోలేదు. మనవాళ్లు 'బ్రీఫ్డ్ మీ' అంటూ చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సెబాస్టియన్ ఫోన్ నుంచి మాట్లాడినట్లుగా చెబుతున్నారు.
కేసు నిలబడుతుందా?
ఆయన వాయిస్ను ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారని, అయితే సాంకేతిక కారణాలతో ఈ కేసు కోర్టుల ముందు నిలబడదనే వాదనలు కూడా ఉన్నాయి. ఏ ఫోన్తో అయితే అప్పుడు మాట్లాడారో అదే ఫోన్ ద్వారానే వాయిస్ టెస్ట్ చేసి నిర్ధారించాల్సి ఉంటుందట. దీంతో పాటు పలు సాంకేతిక కారణాలతో నిలబడకపోవచ్చునని అంటున్నారు. అంతేకాదు, ఈ కేసులో స్టీఫెన్ సన్ ఓటుతో అంతిమ లబ్ధిదారు అని పూర్తి ఆధారాలతో నిరూపించాల్సి ఉందని అంటున్నారు. అలాగే, డబ్బు ఎక్కడిది అనేది కూడా తేల్చాల్సి ఉంది.
కొత్త పేర్లు
ఓటుకు నోటు కేసులో ఏ1గా రేవంత్ రెడ్డి ఉన్నారు. మార్చి మూడో చార్జీషీటు వేయనున్నారని అంటున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బు ఆశ చూపిన ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలతో పాటు ఇతర నేతలు కూడా ఉన్నారనే వాదనలు ఉన్నాయి. వారి పేర్లు కూడా వెలుగు చూస్తాయని అంటున్నారు. అయితే ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదనేది టీడీపీ నేతల వాదన.
అలా చేస్తే ఫ్రెష్ ఛార్జీషీట్... కేసీఆర్కు అధికారులు
ఈ కేసులో ఇదివరకు దాఖలు చేసిన రెండో ఛార్జీషీటును వెనక్కి తీసుకోవాల్సి ఉందని బుధవారం అధికారులు తెలంగాణ సీఎం కేసీఆర్కు చెప్పారని తెలుస్తోంది. ఇందులో పేర్లు చేర్చాల్సి వస్తే మరో ఛార్జీషీటును కొత్తగా వేయాల్సి ఉంటుందని తెలిపారు.
అప్పుడు వైసీపీకి మంచి ఆయుధం
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును ప్రస్తావిస్తే టీడీపీకి ఓ రకంగా దెబ్బే అంటున్నారు. మరోవైపు, వైసీపీ ఎప్పటి నుంచో దీని కోసం ఎదురు చూస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును చూపించి టీడీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్నారు. మూడో ఛార్జీషీట్లో పేరు ఏ1గా ఉంటే వైసీపీకి మంచి ఆయుధం దొరుకుతుందని అంటున్నారు.
ఓటుకు నోటు కేసుపై రోజా
ఓటుకు నోటు కేసు నేపథ్యంలోనే చంద్రబాబు హోదా దీక్షలు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో పూర్తిగా చిక్కుల్లో పడతానని భావించి దీక్షల పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని, చంద్రబాబుపై కేసు కోర్టులో నిలబడదని ఓ వైపు టీడీపీ నేతలు చెబుతున్నారని, మరోవైపు వైసీపీ - బీజేపీ కలిసిపోయిందని చెబుతున్నారని, ఇదేమిటని ఆమె ప్రశ్నించారు.