సొంతింటికి వచ్చినట్లుంది: మాజీ గవర్నర్ రోశయ్య
గాంధీభవన్కు రావడం.. తనకు సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని రోశయ్య అన్నారు.
హైదరాబాద్: నగరంలోని గాంధీభవన్లో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సందడి చేశారు. గాంధీభవన్కు రావడం.. తనకు సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శనివరం గాంధీభవన్లో ఏర్పాటుచేసిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోశయ్యను కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, జీవన్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి ఘనంగా సన్మానించారు. ప్రపంచానికే నాయకత్వం వహించిన మహా వనిత ఇందిరా గాంధీ అని, కుటుంబాన్ని కోల్పోయి కూడా దేశానికి సేవచేసిన ధీరవనిత అని ఈ సందర్భంగా రోశయ్య కొనియాడారు.
ఇందిరా గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. పేదల అభ్యున్నతికి కృషిచేసిన ఇందిరమ్మను గుర్తుచేసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. దేశ సమైక్యతను కోరే ప్రతిఒక్కరూ ఇందిర సేవల్ని స్మరించుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని రోశయ్య చెప్పారు.
28న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు: ఉత్తమ్
నవంబర్ 28న ఆక్రోశ్ దివస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులు కేంద్రానికి తెలిసేలా నిరసనలు ఉంటాయన్నారు. హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీస్ ఎదుట మానవహారం నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు. శనివారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో ఉత్తమ్తో పాటు జానా, వీహెచ్, పొన్నాల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
మోడీ విదేశీ పర్యటలతోనే ఎంజాయ్ చేస్తున్నారు
రైతులు కరువుతో అల్లాడుతుంటే ప్రధాని మోడీ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలపై మోడీ సమీక్ష చేసుకోవాలన్నారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటంలేదని మోడీని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటివరకు మోడీ చేసింది శూన్యమని పొన్నం ఆరోపించారు.