తెలంగాణ ఉద్యమమే టఫ్, హైదరాబాద్లోనే ఉండిపోతా: రోశయ్య
హైదరాబాద్: తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న టఫ్ టైం తెలంగాణ ఉద్యమ సమయమేనని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఓ ప్రయివేటు ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆగస్ట్ 31వ తేదీన ఆయన గవర్నర్ పదవీ కాలం ముగిసింది. ఆయన విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు.
'కొణిజేటి రోశయ్య తమిళనాడులో పరోక్షంగా చాలా చేశారు'
రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. సమైక్య ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి కంటే ముందు దాదాపు ఏడాది కాలం పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది.
దీనిపై రోశయ్య మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను పెద్దగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేదన్నారు. అయితే అతి తక్కువ కాలమే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఎగసిపడిందన్నారు.
ఆ సమయమే తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న టఫ్ టైం అని చెప్పారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానని చెప్పారు. మిగతా జీవితం హైదరాబాదులోనే గడుపుతానని చెప్పారు. విశ్రాంతి తీసుకునేందుకు నిర్ణయించుకున్నందున, పుస్తకం రాసే ఆలోచన ఏదీ లేదని చెప్పారు.
జీవిత చరిత్రను పుస్తకంగా తెచ్చే ఆలోచన లేదన్నారు. తానేమీ దేశం కోసం త్యాగం చేయలేదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతోమంది జీవితాలు వెలుగులోకి రావాల్సిన అవసరముందన్నారు. అలాంటి వారి గురించి భావి తరాలకు తెలియాల్సిన అవసరముందన్నారు.
పద్దెనిమిదేళ్లకే క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వల్ల మంచి అవకాశాలు వచ్చాయని, ప్రతి అవకాశానికి న్యాయం చేసే ప్రయత్నం చేశానన్నారు. వారసులను తయారు చేయాలన్న ఆలోచన రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలంటే ఇప్పుడు చాలా కష్టమని చెప్పారు. ఇలాంటి పరిస్థితులను ఇందిర సమయంలోను వచ్చిందని, దానిని ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారన్నారు.