కేసీఆర్-కేటీఆర్లకు చుక్కలేనా?: నేరెళ్లపై ఒక్కటైన విపక్షాలు.. వీహెచ్ 'ఆమరణదీక్ష'?
థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించాలంటే కచ్చితంగా ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఉన్నతాధికారులను వదిలేసి ఎస్ఐని బలి చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేలా విపక్షాలన్ని ఒక్క తాటి పైకి వచ్చి పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఘటనపై ఇప్పటికే కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వానికి మున్ముందు విపక్షాల సెగ తప్పేలా లేదు.
నేరెళ్ల ఘటన: కెసిఆర్ అలా, సెగ తాకితే గానీ కెటిఆర్ దిగిరాలేదా....
ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత గానీ కేటీఆర్ స్పందించకపోవడం పట్ల కూడా తీవ్రమైన విమర్శలున్నాయి. సీఎం కేసీఆర్ సైతం దళితులను చులకన చేసేలా మాట్లాడారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే మరింత డ్యామేజ్ జరగవద్దని జాగ్రత్తపడ్డ మంత్రి కేటీఆర్.. స్థానిక ఎస్ఐని సస్పెండ్ చేశారు.
థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించాలంటే కచ్చితంగా ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఉన్నతాధికారులను వదిలేసి ఎస్ఐని బలి చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి:
నేరెళ్ల అంశాన్ని జాతీయ స్థాయి చర్చ లేవనెత్తడానికి అఖిలపక్ష నేతలు సన్నద్దమవుతున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం డీజీపీని కలుస్తామని, సమయం ఇవ్వాలని గవర్నర్ ను కూడా కోరినట్లు తెలిపారు. ఈ నెల 22న లేదా 23న రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ లకు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో సిరిసిల్లకు పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు.
దళితులపై దాడులు-వివక్ష:
నేరెళ్ల ఘటన నేపథ్యంలో టీపీసీసీ ఎస్సీ ఛైర్మన్ ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన 'దళితులపై దాడులు-వివక్ష' అన్న అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. నేరెళ్ల బాధితుల చిత్ర పటాలతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూశాక.. ఆయన సిగ్గూ, శరం లేని వ్యక్తి అనిపించిందన్నారు. ఆయనపై ఉన్న కాస్త మర్యాద కూడా లేకుండా పోయిందన్నారు. ఇసుక కాంట్రాక్టర్లంతా ఎవరని ప్రశ్నించిన ఉత్తమ్.. వాళ్లంతా కేసీఆర్ బంధువులు కారా? అని ప్రశ్నించారు.
స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే దళితులపై దాడులు జరిగాయా? ఎవరి అండ లేకుండానే పోలీసులు అంతగా రెచ్చిపోయారా? అని నిలదీశారు. నేరెళ్ల బాధితులకు తాము అండగా నిలుస్తామని ఉత్తమ్ తెలిపారు.
బాంచన్ అన్నా వదలకుండా, కేటీఆర్ ఒక డాన్లా:
బాంచన్ అన్నా వదలకుండా నేరెళ్ల దళితులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేరెళ్ల ఘటనపై సమగ్ర స్థాయి విచారణ జరపాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దానికి కేటీఆర్ ఒక డాన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎవరు టూరిస్టులనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు.
బాధిత కుటుంబాల ఆగ్రహం:
నేరెళ్ల దళితులపై దాడుల విషయంలో బాధితుల కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంది. దళితులం కావడమే మేం చేసిన నేరమా?, మమ్మల్ని మేం చంపుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా? అని ఆవేదన వ్యక్తం చేశారు. చచ్చామో.. బతికే ఉన్నామో చూసేందుకు కేటీఆర్ వచ్చారా? అని నిలదీశారు. ఇటీవల పరామర్శకు వచ్చిన సమయంలోను కేటీఆర్ తమను బెదిరించినట్లు బాధితులు తెలిపారు.
ఆమరణ దీక్ష చేస్తా: వీహెచ్
ఈ నెల 30లోగా ప్రభుత్వం దిగి వచ్చి నేరెళ్ల బాధితులకు న్యాయం చేయకుంటే వారి తరుపున ఆమరణ దీక్షకు దిగుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రకటించారు. గురువారం వేములవాడలోని మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను ఆయన పరామర్శించారు.
నేరెళ్ల ఘటనలో లారీతో గుద్ది చంపిన డ్రైవర్ పై ఇంతవరకు కేసు నమోదు చేశారా? అని వీహెచ్ ప్రశ్నించారు. అసలు ఇసుక కాంట్రాక్టర్లు ఎవరు?.. ఆ లారీల ఓనర్లు ఎవరన్నది ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబాల్లోని వారికి.. వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
మీడియాపై నియంత్రణ, వ్యతిరేకత మొదలైందనే..:
కేసిఆర్, కేటిఆర్ సాగిస్తున్న బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తే లేదని, తాము గాంధేయమార్గాన్ని అనుసరిస్తున్నామని, అది తమ బలహీనత అనుకోవద్దని హెచ్చరించారు. అవసరమైతే రాహుల్ గాంధీని ఇక్కడికి రప్పించి మరీ పోరాడుతామని అన్నారు.
రాష్ట్రంలో మీడియా స్వేచ్చపై కూడా కేసీఆర్ నియంత వైఖరిని అవలంభిస్తున్నారని వీహెచ్ విమర్శించారు. మీడియా యాజమాన్యాలు నిజాలను నిర్భయంగా రాయాలని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న విషయం తెలుసుకునే.. ఊరురూ తిరగాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని వీహెచ్ అన్నారు.
వరుస పరిణామాలు:
మంథని మధుకర్ ఘటన, మందమర్రి సాగర్ పెళ్లి వివాదం, నేరెళ్ల ఘటన, జమ్మికుంట రాజేశ్.. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల మీద దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ వరుస పరిణామాలు ఆ పార్టీకి తీవ్రం నష్టం చేకూర్చుస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకతలో దళిత సామాజికవర్గానిదే కీలక పాత్ర కానుంది. వచ్చే ఎన్నికల్లో ఈ వర్గం గనుక పార్టీకి దూరమైతే టీఆర్ఎస్ కు చేదు ఫలితాలు తప్పవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.