ఎలా చనిపోయింది?.. పటాన్చెరులో బాలిక అనుమానస్పద మృతి
ఇటుకల బట్టీలో పనిచేయాల్సిందిగా బాలిక తల్లిదండ్రులు పలుమార్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారని వారు అంటున్నారు.
హైదరాబాద్: పటాన్ చెరులో 15ఏళ్ల దిండి లక్ష్మీ అనే బాలిక అనుమానస్పదంగా మృతి చెందింది. అంత్యక్రియల విషయాన్ని ఎవరికీ చెప్పకుండా బాలిక తల్లిదండ్రులు దహన సంస్కరాలు పూర్తి చేశారు. ఎందుకింత గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించారనే దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
కేసును అనుమానస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై స్పందించిన బాలల హక్కుల సంస్థ సంగారెడ్డి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఘటనపై ఈ నెల 25లోగా వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.
కాగా, మృతురాలి తల్లిదండ్రులు మహేష్, సక్కుభాయి స్థానిక ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. శనివారం నాడు స్కూల్ కు వెళ్లిన బాలిక.. పరీక్ష కూడా రాసింది. స్కూల్లో బాలిక ఆరోగ్యంగానే ఉందని ప్రిన్సిపాల్ ప్రకాశ్ తెలిపారు.
లక్ష్మి అనారోగ్యంతో మరణించిందని ఆమె తల్లిదండ్రులు తమతో చెప్పినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటుకల బట్టీలో పనిచేయాల్సిందిగా బాలిక తల్లిదండ్రులు పలుమార్లు ఆమెపై ఒత్తిడి తెచ్చారని వారు అంటున్నారు. ఈ క్రమంలో చాలాసార్లు ఆమెను కొట్టారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, సాంప్రదాయం ప్రకారం పెళ్లికాని అమ్మాయిలు మరణిస్తే.. వారిని పూడ్చిపెడుతారు. కానీ లక్ష్మికి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.