మోస్ట్ వాంటెడ్ ఎల్లం గౌడ్ హతం.. తల మొండెం వేరు చేసి ప్రత్యర్థుల కిరాతకం..
రౌడీ షీటర్,దొంగనోట్ల కేసులో నిందితుడు ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో అతన్ని నరికి చంపారు.మెడపై గొడ్డలితో దాడి చేసి తల నుంచి మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు. హత్యానంతరం ముగ్గురు నిందితులు ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు.కొన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఎల్లం గౌడ్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
వెంకట్.. ఎల్లం గౌడ్... సహ నిందితులు..
ఎల్లం గౌడ్ హత్య కేసులో తడకపల్లి వెంకట్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరితో కలిసి అతనే ఎల్లం గౌడ్ను హత్య చేసినట్టు నిర్దారణకు వచ్చారు. ఎల్లం గౌడ్,వెంకట్ పలు నేరాల్లో సహ నిందితులుగా ఉన్నారు. దొంగ నోట్ల వ్యవహారంలో వీరిద్దరు కలిసి పనిచేసినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు,కక్షల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.
తెలంగాణలో 16 కేసులు.. కర్ణాటకలో 4 కేసులు.. మోస్ట్ వాంటెడ్..
సిద్ధిపేట జిల్లాలోని ఇమాంబాద్ ఎల్లం గౌడ్ స్వగ్రామం. తెలంగాణలో అతనిపై 16 దొంగ నోట్ల కేసులున్నాయి. కర్ణాటకలో 4 దొంగ నోట్ల కేసులన్నాయి. మహారాష్ట్రలోనూ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 2014లో శామీర్పేట్లో పోలీసులపై కాల్పుల కేసులోనూ ఎల్లం గౌడ్ నిందితుడిగా ఉన్నాడు. ఎల్లం గౌడ్ గ్యాంగ్ను పట్టుకునేందుకు అప్పట్లో పోలీసులు వేసిన ప్లాన్ విఫలమవడంతో ఓ కానిస్టేబుల్ ఆ గ్యాంగ్ చేతిలో హతమయ్యాడు. మరో ఎస్ఐ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఎల్లం గౌడ్ నేరాలతో పాటే అతని శత్రువుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు అతనిపై హత్యాయత్నం జరిగిందని.. వాటి నుంచి తప్పించుకుని బయటపడ్డాడని స్థానికులు చెబుతున్నట్టు సమాచారం.
Recommended Video
పథకం ప్రకారమే హత్య..
లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు ఎక్కువగా కోవిడ్-19 విధుల పైనే ఫోకస్ పెట్టడంతో ప్రత్యర్థులకు ఎల్లం గౌడ్ను హత్య చేయడం సులువైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఎల్లం గౌడ్ మృతితో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎల్లం గౌడ్కు,తడకపల్లి వెంకట్కు ఎక్కడ చెడిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.