హైదరాబాద్ లో రౌడీ షీటర్ దారుణ హత్య .. వెంటాడి కత్తులతో పొడిచి , రాళ్ళతో కొట్టి
హైదరాబాద్ లో ఓ రౌడి షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ రౌడి షీటర్ పై దాడి చేసింది ఎవరు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ను అతి దారుణంగా హతమార్చారు దుండగులు . పోలీసులు అందించిన వివరాల ప్రకారం బోరబండ సమీపంలోని అల్లాపూర్లో నివసించే 35 ఏళ్ళ వయసున్న నర్సింహదాస్ గౌడ్ అలియాస్ పోచి ఓ రౌడీషీటర్. నర్సింహదాస్ గౌడ్ పై సనత్నగర్, ఎస్ఆర్ నగర్తోపాటు పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదై ఉన్నాయి.
సోమవారం అర్ధరాత్రి శివాజీనగర్ వద్ద సుమారు 20 మంది వ్యక్తులు నర్సింహదాస్ గౌడ్ పై దాడికి దిగారు. అతని వెంటపడి కత్తులు, పలుగు రాళ్లు, గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు దాడి చేసి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరో పక్క సంఘటనా స్థలంలో క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ లతో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.
బోరబండలో రౌడీ షీటర్ హత్య నేపధ్యంలో స్థానికంగా భయాందోళన నెలకొంది. గతంలో కూడా బొరబండలో అమీర్ ఖాన్ అనే రౌడీ షీటర్ హత్యకు గురైన సమయంలో హింసాత్మక వాతావరణం నెలకొంది . దీంతో ప్రస్తుతం మరో రౌడీ షీటర్ హత్య స్థానికంగా ఉన్న ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ కేసులో ఎవరు.. ఎందుకు నర్సింహదాస్ గౌడ్ పై దాడి చేశారు అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియనుంది.