అర్ధరాత్రి నడీరోడ్డుపై రెచ్చిపోయిన రౌడీ షీటర్లు: బట్టలు చించుకొని దాడులు
హైదరాబాద్ నగర శివార్లలో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి గోల్కొండ ఎంజీ లైన్స్ సమీపంలో రెండు వర్గాలు విడిపోయిన రౌడీ షీటర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
హైదరాబాద్: నగర శివార్లలో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం రాత్రి గోల్కొండ ఎంజీ లైన్స్ సమీపంలో రెండు వర్గాలు విడిపోయిన రౌడీ షీటర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఓ రౌడీ షీటర్కు తీవ్ర గాయాలయ్యాయి.
అదిల్, ఫైజల్, మరో రౌడీ షీటర్తో కలిసి అఫ్జల్ అనే మరో రౌడీ షీటర్పై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బట్టలు చిరిగిపోయాయి. అటుగా వెళుతున్న వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు.
నడిరోడ్డుపై ఈ ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. కొద్ది సేపటి తర్వాత రెండు వర్గాలు అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దృష్టిసారించినట్లు తెలిసింది.
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
గంజాయి స్మగ్లింగ్ ముఠాలపై ఎక్సైజ్ పోలీసులు కొనసాగిస్తున్న స్పెషల్ డ్రైవ్లో బుధవారం మరో ఇద్దరు పేరుమోసిన గంజాయి స్మగ్లర్లు చిక్కారు. వీరిలో ఒకరు అప్పర్ ధూల్పేటకు చెందిన బ్రిజ్మోహన్సింగ్(62) కాగా మరొకరు గండిహనుమాన్ ప్రాంతానికి చెందిన అజయ్సింగ్(26)లు ఉన్నారు.
వీరిద్దరూ కల్సి రాజ్కుమార్సింగ్ అలియాస్ కాలూ అలియాస్ రౌడీ కాలూ అనే మరో పెద్ద గంజాయి స్మగ్లర్ నుంచి గంజాయిని సేకరించి జంటనగరాల వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సైజ్ శాఖ హైదరాబాద్ ఏఈఎస్ ఎన్.అంజిరెడ్డి తెలిపారు.