ప్రేమకోసం ఇంజినీరింగ్ ఆపేశారు: మీనాన్న మంచోడుకాదు.. అమృతతో డీఎస్పీ, ఇదీ మారుతీరావు
మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి నల్గొండ ఎస్పీ రంగనాథ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో అమృత తల్లి పాత్ర గురించి కూడా స్పందించారు. ఆమె ఫోన్లో మాట్లాడేది తప్ప ఆమెకు ఈ విషయాలు తెలియదని అన్నారు.
సుభాష్ శర్మ దొంగతనాలు చేసేవాడని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడని చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఏ 1 మారుతీ రావు, ఏ2 సుభాష్ శర్మ (బీహార్), ఏ3 హజ్గర్ అలీ, ఏ4 మహమ్మద్ బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్, ఏ7 శివ (మారుతి రావు డ్రైవర్). సుభాష్ శర్మను పాట్నా నుంచి కోర్టు ద్వారా రేపు మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు.
స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని: అమృత, తెరపైకి కొత్త పేర్లు, అతనే రంగంలోకి దిగాడు!
ప్రేమ కోసం ఇంజినీరింగ్ మధ్యలో ఆపేశారు
జనవరి 30వ తేదీన ప్రణయ్, అమృతల పెళ్లి జరిగిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ 10వ తరగతి, అమృత 9వ తరగతి ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాదులో ఇద్దరు ఇంజినీరింగ్ చేశారని తెలిపారు. ప్రేమ వ్యవహారంలో ప్రణయ్, అమృతలు ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశారని చెప్పారు. పోలీసుల సూచనల మేరకు ప్రణయ్ తన ఇంటి చుట్టూ, ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
పెళ్లయినప్పుడు అమృత మైనర్ కాదు
అమృతకు 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు పెళ్లి అయిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. పెళ్లి అయిన సమయంలో అమృత మైనర్ కాదని చెప్పారు. ఆగస్ట్ 17న ప్రణయ్, అమృతలు వివాహ విందును ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. విందుకు డీఎస్పీని కూడా ఆహ్వానించారన్నారు.
అనుమానంతో అమృతను ముందే అప్రమత్తం చేసిన డీఎస్పీ
మారుతీ రావును డీఎస్పీ అనుమానించారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. తండ్రి వ్యవహారశైలిపై అనుమానంతో అమృతను డీఎస్పీ ముందే అప్రమత్తం చేశారని తెలిపారు. మీ తండ్రి మంచివాడు కాదని, హానీ చేస్తారని ముందే డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు.
తొలుత కష్టాన్ని, ఆ తర్వాత మోసాన్ని నమ్ముకున్నాడు
అమృతకు గర్భస్రావం చేయించేందుకు మారుతీరావు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. గర్భస్రావం చేయాలని వైద్యురాలు జ్యోతి పైన కూడా ఒత్తిడి తెచ్చారని అన్నారు. మారుతీ రావు తొలుత కష్టాన్ని, ఆ తర్వాత మోసాన్ని నమ్ముకొని ఎదిగాడని చెప్పారు. మారుతీ రావు స్థిరాస్తి వ్యాపారాలపై వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపిస్తామని తెలిపారు. అమృత తండ్రి మారుతీరావుకు, బాబాయి శ్రవణ్కు మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. 2011 నుంచి బారీతో మారుతీ రావుకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మారుతీ రావు ఆలోచన మేరకే ప్రణయ్ హత్య జరిగిందన్నారు. హత్య తర్వాత మారుతీ రావు, సుభాష్ శర్మ మాత్రమే లొంగిపోవాలని అనుకున్నారని చెప్పారు.
ఆ డబ్బును ముగ్గురు పంచుకున్నారు
హత్యకు ప్లాన్ రూపకల్పన చేసిన తర్వాత జూలై 9వ తేదీన రూ.15 లక్షలు విజయవాడ హైవేలో ఇచ్చారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అడ్వాన్స్ డబ్బును బారీ, హజ్గర్, కరీంలు పంచుకున్నారని తెలిపారు. ప్రణయ్ హత్యకు మూడు నెలలుగా ప్లాన్ వేశారని చెప్పారు. నకిలీ నెంబరుతో స్కూటీ, 3 సిమ్ కార్డులు సిద్ధం చేసుకున్నారని చెప్పారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు.
బ్యూటీపార్లర్ వద్ద తమ్ముడు ఉండటంతో
గతంలో రెండుసార్లు చంపాలని అనుకున్నారని, బ్యూటీ పార్లర్ వద్ద హత్య చేయాలనుకున్నప్పటికీ తమ్ముడు ఉండటంతో చంపలేకపోయారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఆగస్ట్ 17న రిసెప్షన్ కాగా, 23వ తేదీన హైదరాబాదులో ఆపరేషన్ మొదలైందని చెప్పారు. కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్లాన్ చేసి విరమించుకున్నారని చెప్పారు. సుభాష్ శర్మ సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడకు వచ్చాడన్నారు. అజ్గర్ డైరెక్షన్లో హత్యకు ప్లాన్ వేశారన్నారు.
ఇలా వెళ్లిపోయారు
భారీ పర్యవేక్షణలో మారుతీ రావు, శ్రవణ్లు తప్పించుకున్నారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. నిందితులు సాగర్ మీదుగా హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లారని చెప్పారు. అక్కడి నుంచి పాట్నాకు వెళ్లిపోయారని తెలిపారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో అస్గర్ అలీ ఉన్నాడని, జైల్లో సుభాశ్ శర్మతో పరిచయం ఏర్పడిందన్నారు. ప్రణయ్ను చంపేందుసు సుభాష్ను అలీ రంగంలోకి దింపాడన్నారు.
పరువు హత్యపై ఎస్పీ ఆగ్రహం
పరువు హత్యగా పేర్కొనడంపై ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఇది పరువు హత్యగా చెప్పడం సరికాదన్నారు. నిజంగా హత్య చేసి పరువు పోగొట్టుకున్నాడని చెప్పారు. కులం, డబ్బుతో పరువు ఉండదని చెప్పారు. హత్యోదంతానికి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. మారుతీ రావు రెండు నెలల క్రితం తెరాసలో చేరారని అన్నారు. మహ్మద్ బారీ మజ్లిస్ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. మిర్యాలగూడకు చెందిన కరీం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. అయినప్పటికీ హత్యకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు.