దొంగ నోట్ల ముఠా: రూ.2000 నోటుపై కాగితం పెట్టి గీస్తే.. సీపీ చెప్పిన 'కొత్త' ఫీచర్లు
దొంగ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత శనివారం నాడు తెలిపారు. కొత్తగా వచ్చిన నోట్లు.. దొంగ నోట్ల మధ్య వ్యత్యాసాలను వివరించారు.
హైదరాబాద్: దొంగ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత శనివారం నాడు తెలిపారు. కొత్తగా వచ్చిన నోట్లు.. దొంగ నోట్ల మధ్య వ్యత్యాసాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
గచ్చిబౌలి కమిషనరేట్ పరిధఇలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నకిలీ కరెన్సీ ముఠాలు రూ.2000 నోటు పైన దృష్టి సారించాయని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ముఠా దొంగ నోట్లను ముద్రించిందని, రూ.10, రూ.20, రూ.50 నోట్లను చలామణిలోకి తెచ్చిందన్నారు.
దొంగ నోట్లను గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు. సెక్యూరిటీ ఫీచర్స్తో నోట్లను సులువుగా గుర్తించవచ్చునని చెప్పారు. దొంగ నోట్లు రాగానే బ్యాంక్ సిబ్బంది చించి వేయడంతో నోటు తెచ్చిన వాళ్లనే అనుమానించవలసి వస్తోందన్నారు.
కొత్త నోటు ఫీచర్లు ఇవే..
కొత్త రూ.2000 నోటు ఫీచర్లను పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఒరిజినల్ నోట్ల పేపర్లో శబ్దం ఎక్కువ వస్తుందని, నకిలీ కరెన్సీలో శబ్దం తక్కువ వస్తుందని తెలిపారు. రూ.2 వేల నోటులో కుడివైపు లైన్లు ఉబ్బెత్తుగా ఉంటాయని, నకిలీ కరెన్సీలో అలా ఉండవని చెప్పారు.
కరెన్సీ మధ్యలో ఆర్బీఐ లైన్ మెరుస్తూ ఉంటుందన్నారు. కొత్త రూ.2వేల నోటు పైన తెల్లని కాగితం పెట్టి పెన్సిల్తో గీస్తే ఆ కాగితంపై ఆర్బీఐ, ఆ నోటుకు సంబంధించిన వివరాలు వస్తాయన్నారు. నకిలీ కరెన్సీలో అవి రావని చెప్పారు. అసలు నోటులో అశోక చక్రం ఉబ్బెత్తుగా ఉంటుందన్నారు.
కేటుగాళ్లు
పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు మాత్రం ఈ పరిస్థితుల్లోనూ నకిలీ నోట్లను తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటి దాకా రూ.500, రూ.1000 నోట్లే నకిలీవి తయారవుతున్నట్లు అంతా అనుమానిస్తుండడంతో ఓ ముఠా తెలివిగా రూ.10, రూ,20, రూ.50, రూ.100 నోట్లను తయారు చేస్తూ చలామణీ చేస్తోంది. జిరాక్స్ మెషిన్తో వీటిని తయారు చేసిన ఈ ముఠా, తాజాగా మార్కెట్లోకి వచ్చిన రూ.2000 నోట్లనూ తయారు చేసి చలామణీ చేసే ప్రయత్నం చేసింది. విషయం పోలీసులకు తెలియడంతో గుట్టు రట్టయింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం వివరాలు వెల్లడించారు.
దొంగ నోట్ల ప్లాన్ ఇలా..
ఇబ్రహీంపట్నంకు చెందిన సాయి కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనే ఆశతో దొంగనోట్లను చెలామణి చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని ఓ హత్య కేసులో చర్లపల్లి జైలులో ఉన్న తన స్నేహితుడు గణేశ్కు చెప్పాడు. గణేశ్కు నకిలీ నోట్ల కేసులో నిందితుడు, సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్కు చెందిన అంజయ్యతో పరిచయం ఉంది. దీంతో అతడిని కలవాల్సిందిగా సాయికి సూచించాడు. అయితే అంజయ్యను కలిసేందుకు వెళ్లిన సాయికి అతడు కలవకపోవడంతో అతని స్నేహితుడు సత్యనారాయణను కలిశాడు.
దొంగ నోట్ల ప్లాన్
నిజామాబాద్కు చెందిన శ్రీకాంత్ నకిలీ నోట్లను తయారుచేయగలడని సత్యనారాయణ చెప్పడంతో సాయి.. శ్రీకాంత్ను కలిసి రూ.2.90 లక్షలు ఇచ్చాడు. కానీ, శ్రీకాంత్ ఎంతకీ నకిలీ నోట్లు తయారు చేయకపోవడంతో సాయి, తన స్నేహితుడు రమేశ్తో కలిసి అంజయ్యను సంప్రదించాడు. దీంతో విజయ్ కుమార్, కల్యాణ్లు నోట్లను తయారు చేస్తారని అంజయ్య చెప్పాడు.
చిన్న నోట్ల నుంచి రూ.2000 నోట్ల దాకా
సాయి వారితో కలిసి సికింద్రాబాద్లో కలర్ జిరాక్స్ మెషిన్ కొనుగోలు చేసి సిరిసిల్లలో నోట్లను తయారు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో మరో చిన్న జిరాక్స్ మెషిన్ను కొనుగోలు చేశారు. దీంతో మొదట రూ.10, 20, 50 నోట్లను తయారుచేసి మార్కెట్లో చలామణీ చేశారు. ఇటీవల జరిగిన పెద్ద నోట్ల రద్దుతో రూ.2000 వేల నోట్లను కూడా తయారు చేసి చలామణీకి సిద్ధమయ్యారు.
చలామణిలోకి రూ.2వేల నోట్లు తేలేదు
ఎస్వోటీ పోలీసులు పక్కా సమాచారంతో ఇబ్రహీంపట్నంలోని రమేశ్ ఇంటిపై దాడి చేసి సాయి, అంజయ్య, రమేశ్, సత్యనారాయణ, శ్రీకాంత్, విజయ్ కుమార్లను అరెస్టు చేశారు. కల్యాణ్, శ్రీకాంత్ పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.2.22 లక్షల నకిలీ కరెన్సీతోపాటు రూ.50 వేల నగదును, రెండు జిరాక్స్ మెషిన్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లలో రూ.2000 నోట్లు 105 ఉన్నట్లు సీపీ భగవత్ తెలిపారు. రూ. 2000 నోట్లను ఇంకా చలామణీలోకి తేలేదన్నారు.