ఎవరి సొమ్మో?: రూ.45కోట్లను టాటా ఏస్ వాహనంలో తరలించారు!
నల్గొండ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.45కోట్ల బ్యాంకు డబ్బును ఓ సాధారణ టాటాఏస్ ట్రాలీలో తరలించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉన్న ఎస్బీఐ ప్రధాన బ్యాంకు నుంచి అధికారులు ఇతర బ్రాంచీలకు టాటా ఏస్ వాహనంలో రూ.45 కోట్లకు పైగా నగదును తరలించారు. ఓ ఏఎస్సై స్థాయి అధికారిని వాహనంలో వెనకాల నిల్చొబెట్టారు.
ఓ మామూలు వాహనంలో ఇంత భారీ డబ్బుల కట్టలు తీసుకొని వెళ్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు. ప్రజల డబ్బులు అంటే ఇంత నిర్లక్ష్యమా? అంటూ వారు మండిపడ్డారు.
ఏదైనా ప్రమాదం జరగడం లేదా దొంగలు ఈ డబ్బుపై కన్నేసి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవేనోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, బ్యాంకు నుంచి డబ్బులు పంపిణీ చేసే ప్రత్యేక రక్షణతో కూడిన వాహనం లేక అత్యవసర సమయంలో ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.