రాత్రికి రాత్రే తెలంగాణ రైతు ఖాతాలో రూ.473 కోట్లు... ఏం జరిగిందో.. ఎందుకలా జరిగిందో...
తెలంగాణకి చెందిన ఓ రైతు ఖాతాలో రాత్రికి రాత్రే రూ.473కోట్లు జమయ్యాయి. డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్కు వెళ్లిన అతను... అంత డబ్బు తన ఖాతాలో చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. మొదట ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేయగా... ఏటీఎం స్లిప్పై రూ.473,13,30,000 ఉన్నట్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ రైతు వెంటనే మరో బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేశాడు. అక్కడ కూడా అంతే డబ్బు ఉన్నట్లు చూపించడంతో తన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందో తెలియక విస్తుపోయాడు.
ఇలా వెలుగులోకి...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి ఓ సాధారణ రైతు. డబ్బులు బుధవారం(డిసెంబర్ 9) సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు వెళ్లిన సంజీవరెడ్డి... డబ్బులు అవసరమై స్థానికంగా ఉన్న డీసీసీబీ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏటీఎం నుంచి డబ్బులు రాలేదు. దీంతో ఖాతాలో బ్యాలెన్స్ చేయగా రూ.473,13,30,000 ఉన్నట్లు తేలింది.
ఎస్బీఏ ఏటీఎంలో చెక్ చేసినా...
అంత డబ్బు తన ఖాతాలోకి ఎలా వచ్చిందో సంజీవ రెడ్డికి అర్థం కాలేదు. ఏటీఎంలో లోపం కారణంగా తప్పుగా చూపించి ఉండవచ్చునని భావించాడు. వెంటనే సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంకి వెళ్లి ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేశాడు. అక్కడ కూడా అంతే.. ఖాతాలో రూ.473,13,30,000 ఉన్నట్లు చూపించింది కానీ డబ్బులు విత్ డ్రా కాలేదు. దీంతో గురువారం(డిసెంబర్ 10) భువనగరిలోని తన ఖాతా ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు.
ఫ్రీజ్ అయినట్లు చెప్పిన అధికారులు...
ఏటీఎం రిసిప్ట్ను తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు చూపించాడు. తన బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా కావట్లేదని కూడా చెప్పాడు. దీంతో సంజీవరెడ్డి ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారి.. ఆయన ఖాతా ఫ్రీజ్ అయినట్లు చెప్పారు. అయితే అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు,సంజీవరెడ్డి ఖాతాలో కేవలం రూ.4వేలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆ రూ.473కోట్లు తన ఖాతాలోకి ఎలా వచ్చినట్లు,ఎందుకు వెనక్కి వెళ్లినట్లు తెలియక సంజీవరెడ్డి వెనుదిరిగాడు. సంజీవరెడ్డి ఖాతాలో భారీగా డబ్బు జమ అయినట్లు స్థానికంగా ప్రచారం జరగడంతో చాలామంది ఆయన్ను ఆరా తీయడం మొదలుపెట్టారు.