శ్రీవారికి రూ.5 కోట్ల మొక్కు: లేఖ రాసి, లెక్క తీస్తానని కేసీఆర్కు మర్రి షాక్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఝలక్ ఇచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఝలక్ ఇచ్చారు. కేసీఆర్ శ్రీవారికి రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను మొక్కు చెల్లించుకున్న విషయం తెలిసిందే.
దీనిపై మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ శ్రీవారికి సమర్పించిన కానుకలకు ప్రభుత్వ ధనాన్ని వాడటం సమంజసం కాదన్నారు. ఆయన ఇచ్చిన మొక్కుకు ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వ ధనం విషయంలో పారదర్శకత అవసరమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల శ్రీవారికి సమర్పించిన ఆభరణాలకు విలువ కట్టి లెక్క తేల్చాలని టిటిడికి తాను లేఖ రాస్తానని మర్రి చెప్పారు. నిరుద్యోగ ర్యాలీ తలపెట్టిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్టు పైన కూడా మర్రి స్పందించారు. కోదండ, ఇతర జేఏసీ నేతల అరెస్టును ఖండించారు.
శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకొని, బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
మొక్కుపై మర్రి ప్రశ్న
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆయన శ్రీవారికి మొక్కుకున్నారు. తెలంగాణ వస్తే ఆభరణాలు చేయిస్తానని మొక్కుకున్నారు. తెలంగాణ సిద్ధించిన మూడేళ్ల తర్వాత ఆయన మొక్కు చెల్లించుకున్నారు. ఈ మొక్కు చెల్లించేందుకు ప్రజాధనం ఎందుకు తీసుకున్నారని మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
ఇవీ శ్రీవారికి సమర్పించినవి
తిరుమల శ్రీవారికి కేసీఆర్ దంపతులు రూ.5 కోట్ల విలువైన బంగారు సాలిగ్రామహారం, కంఠాభరణాన్ని సమర్పించారు. 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారు కంఠెను ఆయన సమర్పించారు.
శ్రీవారి ఆలయన నిర్మాణానికి సహకారం
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను చల్లగా చూడాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, దేశంలో ముందుండాలన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. హైదరాబాదులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తామన్నారు.
కేసీఆర్.. వరంగల్ భద్రకాళికి కూడా..
తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల శ్రీవారికి మాత్రమే మొక్కు చెల్లించుకోలేదు. గతంలో వరంగల్ భద్రకాళీ అమ్మవారికి 11.7 కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారు. దాని విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుంది.
2015లో చండీయాగంపై విమర్శలు
కేసీఆర్ 2015 డిసెంబర్ నెలలో ఆయుత చండీయాగం నిర్వహించారు. దీని పైన పలువురు మండిపడ్డారు. ఓ వైపు రైతు ఆత్మహత్యలు, రాష్ట్రంలో కరవు ఉన్న సమయంలో చండీయాగం చేయడం ఏమిటని నాడు ప్రశ్నించారు. మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి గ్రామంలో చండీయాగం నిర్వహించారు. అయితే, అది సొంత డబ్బులతో చేశారు.