రైతుబంధు: తెలంగాణ బ్యాంకులకు రూ.5400కోట్లు పంపిణీ చేసిన ఆర్బీఐ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు బంధు' పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఎకరాకు రూ.4వేలు చొప్పున రైతులకు చెక్కులు కూడా అందించింది.
అయితే ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులను బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూశామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా వెల్లడించింది. ఇందుకోసం తెలంగాణలోని బ్యాంకులకు రూ.5,400కోట్లు సరఫరా చేసినట్లు తెలిపింది.
'రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను రైతులు తమ ఖాతాల నుంచి తీసుకునేందుకు వీలుగా తెలంగాణలోని బ్యాంకులకు రూ. 5,400కోట్లు సరఫరా చేశాం. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంది. ఈ విషయమై బ్యాంకులు, రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. బ్యాంకుల నుంచి నగదు కొరత లాంటి సమస్యలేం లేవు' అని ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ ఆర్ సుబ్రమణియన్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేలు చొప్పున ఏడాదికి రెండుసార్లు రైతులకు ఆర్థికసాయం అందిస్తుంది. రైతుబంధు పథకం కోసం ఎస్బీఐ నేతృత్వంలోని మొత్తం 8 బ్యాంకులు 59లక్షల చెక్కులను ముద్రించాయి. ఈ చెక్కులను ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. కాగా, ఏప్రిల్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పుడు నగదు పరిస్థితి మెరుగుపడిందని సుబ్రమణియన్ తెలిపారు.