కెసిఆర్-మోడీ వేగాన్ని ఎవరూ అందుకోలేరు: మళ్లీ వస్తానన్న హర్ సిమ్రాత్
నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ వేగాన్ని ఎవరూ అందుకోలేరని కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ సోమవారం అన్నారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లిలో మెగా ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె కెసిఆర్ పైన ప్రశంసలు కురిపించారు.
పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వాలన్నా, అభివృద్ధి పనులు చేయాలన్నా గత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి తిప్పుకునేవని, కెసిఆర్, మోడీ ప్రభుత్వాలు గతంలో మాదిరిగా నెమ్మదిగా పని చేయవని, లక్కంపల్లిలో ఫుడ్పార్కు ఏర్పాటు ప్రక్రియ ఏడేళ్లుగా కొనసాగుతోందన్నారు.
ఇప్పుడు అలా కుదరదని చెప్పారు. 24 నెలల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి వస్తానని హర్ సిమ్రాత్ కౌర్ బాదల్ చెప్పారు. నల్గొండ, మేడ్చల్, మెదక్లో రూ.362 కోట్లతో దీనికి అనుబంధ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
లక్కంపల్లిలో స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్పార్కు పనులకు కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డితో కలిసి సోమవారం హర్ సిమ్రాత్ శంకుస్థాపన చేశారు. ఈ మెగా ఫుడ్ పార్క్ 800 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్రం కూడా రూ.2 వేల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నాబార్డు నిధిని ఏర్పాటు చేసిందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో లెదర్ పార్కు మంజూరు చేయాలని ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారని.. కేంద్ర మంత్రులతో చర్చించి మంజూరుకు కృషి చేస్తానన్నారు.
కేంద్రం తొలి విడతలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేసే మెగా ఫుడ్ పార్క్కు రూ.110 కోట్లు మంజూరు చేసిందని, వాటిని పసుపు పరిశోధన కేంద్రం అభివృద్ధికి ఖర్చు చేయాలని స్మార్ట్ ఆగ్రో యాజమాన్యానికి సూచించారు. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని కొనియాడారు.