కేసీఆర్, జగన్ పై ఒత్తిడి పెంచనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపబోతోంది. తెలంగాణాలో అదికారంలో ఉన్న కేసీఆర్, ఆంద్రలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ల పై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో అనుసరిస్తున్న స్నేహపూర్వక వైఖరే ఆ రెండు పార్టీలకు శరాఘాతంగా పరిణమించబోతోంది. బీజేపి, కాంగ్రేస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్ తెరమీదకు రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పడం, అందుకు తగ్గట్టుగానే బీజేపికి వ్యతిరేకంగా మద్దత్తు కూడగట్టే కార్యక్రమానికి దిగడం తెలిసిందే..! ఇటు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రం ఏపి ప్రజలను మోసం చేసిందని పలు సందర్బాల్లో బీజేపిని విమర్శించిన సందర్బాలు చూసాం. కాని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో మాత్రం ప్రధాని మోదీ మాటకు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి సున్నిత పరిస్థితులను అదిగమించి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లు నిర్ద్వంధంగా మోదీని వ్యతిరేకిస్తున్నామని ఎలా నిరూపించుకుంటారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన స్వరాలు ఇప్పుడే రాగం అందుకుంటాయి..??
త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, అటు వైసీపీలకు అగ్ని పరీక్షగా మారబోతోంది. ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీతో రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీతో కేసీఆర్ చేతులు కలిపారన్న అభిప్రాయం జనాల్లో కలిగితే ముస్లీం ఓటుబ్యాంకుతో టీఆర్ఎస్ కు గండి పడే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ - మోడీ పట్ల అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ పార్టీతో వైసీపి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కలిశారన్న భావన కలిగితే సదరు పార్టీకి తీవ్ర నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు అవసరమవుతుంది. ఈ మధ్యనే ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం కూడా కేసీఆర్ తో చర్చించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికకు మద్ధతివ్వాల్సిందిగా కేసీఆర్ ను మోడీ కోరినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ గట్టునేమో ఫెడరల్ ఫ్రంట్ అభ్యర్థి.. ఆ గట్టునేమో బీజేపి అభ్యర్థి.. కేసీఆర్, జగన్ ఏ గట్టునుంటారు..
ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఆరు రాజ్యసభ స్థానాలు ఉండగా... వైసీపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. బీజేడీ మద్ధతు ఇచ్చిన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మద్ధతు బీజేపీకి అవసరమవుతుంది. టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో కయ్యానికి కాలుదువ్వింది కనుక ఆ పార్టీకి మద్ధతిచ్చే అవకాశం లేనే లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, వైసీపీల మద్ధతు బీజేపీకి అనివార్యం అవుతుంది. కథ అంతటితో అయిపోలేదు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ఎన్నికకు అభ్యర్థిని నిలిపే యోచనలో కొన్ని ప్రాంతీయ శక్తులు వ్యూహ రచన చేస్తున్నాయి.
చంద్రబాబు విశ్వసనీయతకు పరీక్ష..
అదే జరిగితే టీడీపీ అనివార్యంగా ఆ కూటమి అభ్యర్థికే మద్ధతిస్తుంది. కాంగ్రెస్ కూడా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మమత కూటమికే మద్ధతివ్వచ్చు. అప్పుడు కేసీఆర్ ఏ లైన్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఇప్పటికే మమతా బెనర్జీని కలిసి చర్చలు జరిపారు. బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమి అంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ అభ్యర్థిని బరిలోకి దింపితే కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు మోడీ కోరిక మేరకు ఎన్డీయే అభ్యర్థికి ఓటేయాలా లేక తాను చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్ అభ్యర్థికి ఓటేయాలా అన్న సందిగ్ధ పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కేసీఆర్, జగన్ తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు ఓ స్పష్టత వచ్చే అవకాశం..
అదే సమయంలో జగన్ కూడా తన ఇద్దరు సభ్యులతో ఎవరికి ఓటు వేయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే... ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ - వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని... కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీ కన్నెర్ర - అవునంటే ఏపీ ప్రజలకు ఆగ్రహం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది. సైలెంట్ గా ఓటింగ్ కు దూరంగా ఉంటే... దేశ రాజకీయాల్లో వైసీపీ పాత్ర శూన్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గండం నుంచి ఇటు కేసీఆర్, అటు జగన్ ఎలా బయటపడతారో చూడాలి.