సోమాజిగూడలో పట్టుబడ్డ 12లక్షల కొత్త నోట్లు: ఇద్దరు అరెస్టు..
సోమాజిగూడ పెట్రోలు బంకు వద్ద నవీన్ అనే వ్యక్తి నుంచి శుక్రవారం నాడు 12లక్షలు భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పంజాగుట్ట: ఓవైపు కొత్త నోట్లు దొరక్క సామాన్యులంతా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంటే.. బడాబాబులకు మాత్రం కోట్ల కొద్ది కొత్త కరెన్సీ వాళ్ల కాళ్ల వద్దకే వచ్చి చేరుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ లోని పంజాగుట్టలో రూ.12లక్షల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోమాజిగూడ పెట్రోలు బంకు వద్ద నవీన్ అనే వ్యక్తి నుంచి శుక్రవారం నాడు ఈ భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కొత్త నోట్లన్ని నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన వ్యాపారులు మహేష్, వెంకన్నలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. పాత నోట్లను మార్చుకోవడం కోసం వ్యాపారులను సంప్రదించిన నవీన్.. వారిని బెదిరించి కొత్త నోట్లు తీసుకున్నాడు.
అనంతరం తన వద్ద ఉన్న పాత నోట్లు అరగంటలో తీసుకువస్తానని చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో నవీన్ కోసం వేట ప్రారంభించిన పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఏసీబీలో హోంగార్డుగా పనిచేస్తున్న నరేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వ్యాపారుల వద్దకు కొత్త నోట్లు ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.